తిరుమలలో ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి.. అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వహించే విశేష ప‌ర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. 'అక్టోబ‌ర్ 1న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీ‌వారి ర‌థోత్సవం.. అక్టోబ‌ర్ 2న చ‌క్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణం.. అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి. అక్టోబ‌ర్ 07న పౌర్ణమి గరుడ సేవ.. అక్టోబ‌ర్15న తిరుమ‌ల నంబి ఉత్సవారంభం. అక్టోబ‌ర్ 20న తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం.. అక్టోబ‌ర్ 23న భ‌గినీహ‌స్త భోజ‌నం. అక్టోబ‌ర్ 24న తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌.. అక్టోబ‌ర్ 25న నాగుల చ‌వితి, పెద్ద శేష వాహ‌నం. అక్టోబ‌ర్ 27న మాన‌వాళ మ‌హామునుల శాత్తుమొర‌.. అక్టోబ‌ర్ 28న సెనైమొద‌లియార్ వ‌ర్ష తిరు న‌క్షత్రం. అక్టోబ‌ర్ 29న తిరుమ‌ల శ్రీ‌వారి పుష్పయాగ మ‌హోత్సవ అంకురార్పణ‌.. అక్టోబ‌ర్ 30న తిరుమ‌ల శ్రీ‌వారి పుఫ్పయాగం. అక్టోబ‌ర్ 31న పూద‌త్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్షత్రం, యాజ్ఞవ‌ల్క్య జ‌యంతి' నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.'తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగ‌ళ‌వారం సాయంత్రం తిరుమలలోని కల్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్ లో అత్యంత ఘనంగా జరిగింది. అక్టోబ‌ర్ 1వ‌ తేదీ బుధ‌వారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, అటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నది. కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు' అని టీటీడీ తెలిపింది.బ్రహ్మోత్సవాల్లో అన్న ప్రసాదాల పంపిణీపై 99 శాతం భ‌క్తులు సంతృప్తి వ్యక్తం చేశార‌ని టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో ఎం.రాజేంద్ర కుమార్ తెలిపారు. తిరుఅన్న ప్రసాద విభాగం ప్రత్యేక అధికారి జీఎల్ ఎన్ శాస్త్రితో క‌లిసి వివరాలు వెల్లడించారు. 'బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన‌ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నాము. దాత‌లు 23 ర‌కాల కూర‌గాయ‌ల‌ను విరాళంగా అందించారు. బ్రహ్మోత్సవాల్లో 24వ తేది నుండి 29వ తేది వ‌ర‌కు 23,48,337 మంది భ‌క్తుల‌కు అన్న ప్రసాదాలు అందించ‌గా 11,32,160 మంది భ‌క్తుల‌కు పానీయాలు అంద‌జేశాము' అన్నారు.'విశేష‌మైన గ‌రుడ వాహ‌నం రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాల‌రీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద 9,28,000 మంది భ‌క్తుల‌కు అన్న ప్రసాదాలు, 6,27,200 మందికి పానీయాలు పంపిణీ చేశామ‌ు. 4,36,994 మంది భ‌క్తుల‌కు బిస్కెట్ ప్యాకెట్లు, సుండ‌లు పంపిణీ చేశాము. మొత్తం 16 ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసి గ్యాల‌రీల్లోని భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్రతి గంట‌కు ఒక్కొ ర‌క‌మైన ప్రసాదాన్ని పంపిణీ చేశామ‌ు. దాదాపు 30వేల మంది భ‌క్తుల‌కు బాదం పాలు పంపిణీ చేశాము' అని తెలిపారు. 'దాదాపు 1300 మంది సిబ్బంది భ‌క్తుల‌కు ఎప్పటిక‌ప్పుడు అన్న ప్రసాదాలు చేర‌వేసేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేశారు. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో పోలీసుల సాయంతో మాడ‌వీధుల్లోకి అన్న ప్రసాదాల‌ను తీసుకెళ్లేందుకు ప్రత్యేక చ‌ర్యలు తీసుకున్నాము. గ‌త సంవ‌త్సరంతో పోల్చితే ఈ ఏడాది 33శాతం అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాము. భక్తులకు అన్నప్రసాదాలు అందించడంలో శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారు' అన్నారు.