ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. 'ఉపరితల ఆవర్తనం ప్రభావంతో,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయవ్య దిశగా కదిలి పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుంది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గుజరాత్‌ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం ఇవాళ అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. అది వాయుగుండంగా బలపడే అవకాశముంది అంటున్నారు.ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులు (బుధ,గురువారం) వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతయాని భావిస్తున్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కూడా భారీగా వానలకు అవకాశం ఉందంటున్నారు. 'మంగళవారం రోజు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 4, కృష్ణా జిల్లా పెడనలో 3.95, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47, నర్సీపట్నం, కాకినాడల్లో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది' అని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,69,188 క్యూసెక్కులు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 7లక్షల క్యూసెక్కుల లోపు వరద చేరే అవకాశం ఉంది. గోదావరి నది భద్రాచలం దగ్గర 50.30 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 11,03,802 క్యూసెక్కులు ఉండి మొదటి హెచ్చరిక కొనసాగుతుంది. దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరి ఆతరువాత గురువారం నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉంది' అని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.మరోవైపు ఐఎండీ అంచనా ప్రకారం ఈ ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉండే పోస్ట్‌ మాన్‌సూన్‌ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబరులో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఈ వర్షాలు నీటి వనరులకు, వ్యవసాయానికి మంచివని.. కానీ వరదల ప్రమాదం కూడా ఉంది కాబట్టి, ఐఎండీ ఇచ్చే ముందస్తు హెచ్చరికలను పాటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రాష్ట్రంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉండే పోస్ట్‌ మాన్‌సూన్‌ సీజన్‌లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అక్టోబరు నెలలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఎక్కువ వర్షాల వల్ల నీటి వనరులు నిండుతాయంటున్నారు.