మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ.. 67 శాతం ప్రీమియంతో లిస్టింగ్.. ఆపై 5 శాతం అప్పర్ సర్క్యూట్

Wait 5 sec.

: మౌలిక వసతుల రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. ఘనంగా అడుగుపెట్టాయి. ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్ఈతో పాటు ఎన్ఎస్ఈలోనూ 67 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర రూ. 117 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ధర రూ. 70తో పోలిస్తే 67.14 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ మొదలు పెట్టింది. మంచి రిటర్న్స్ రాబట్టింది. బీఎస్ఈలో రూ. 117 వద్ద లిస్టింగ్ అయిన తర్వాత 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ రూ. 122.84ను తాకింది. దీంతో ఐపీఓ ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు ఎంట్రీతోనే 75 శాతం లాభాలు వచ్చినట్లయింది. ఎన్ఎస్ఈలోనూ ఈ స్టాక్ 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ అంచనాలను మించి రాణించింది. గ్రే మార్కెట్ ప్రీమియం 24గా ఉండేది. 33 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అవుతుందని అంచనాలున్నాయి. అయితే, అంతకు మించి రెండింతల ప్రీమియంతో లిస్టింగ్ కావడం గమనార్హం. హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు భారీ స్పందన లభించింది. మూడు రోజుల బిడ్డింగ్ ప్రక్రియలో 316 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ విభాగంలో 164.48 రెట్లు, ఎన్ఐఐ కోటాలో 473 రెట్లు, క్యూఐబీ విభాగంలో 432 రెట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా రూ. 130 కోట్లు సమీకరించే లక్ష్యంతో వచ్చింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ. 97.52 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 32.48 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ మూలధన అవసరాలు, జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈపీసీ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోనూ సేవలందిస్తోంది. ఇండోర్ కేంద్రంగా సేవలందిస్తోన్న ఈ కంపెనీ రోడ్ల నిర్మాణం, నిర్వహణ బిజినెస్ సహా హైవేల నిర్మాణం, బ్రిడ్జుల నిర్మాణం, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వంటివి చేస్తోంది. మే 31, 2025 నాటికి ఏకీకృత ఆర్డర్ బుక్ విలువ రూ. 6663 మిలియన్లుగా ఉంది. ఇందులో టోల్ కలెక్షన్లు రూ. 595.3 మిలియన్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.