హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయాణం చేసేవారికి తీపి కబురు. త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరి.. సాఫీగా ప్రయాణాలు సాగనున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి , రెండో దశలో జేబీఎస్-శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించారు. ఇందులో ప్యారడైజ్ - బోయిన్‌పల్లి పనులు ప్రారంభమయ్యాయి. బోయిన్‌పల్లి డెయిరీ ఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల మేర నిర్మించనుండగా.. దీని అంచనా వ్యయం రూ. 1550 కోట్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా అధికారులు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు నెలల్లో ఈ పరీక్షలు పూర్తి చేసి.. వాటి ఫలితాల ఆధారంగా పిల్లర్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ నిర్మాణానికి డిఫెన్స్కు చెందిన 113.48 ఎకరాల భూమి అవసరం. దీని కోసం డిఫెన్స్ విభాగంతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది, భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ మార్గంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉండటం వల్ల బాలాంరాయ్ వద్ద 600 మీటర్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. దీనికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి లభించింది. ఈ కారిడార్ పూర్తయితే సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా వెళ్లే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.రెండో కారిడార్ వద్ద ఔటర్ రింగ్‌ రోడ్డును కలిపేలా 18 కిలోమీటర్ల మేర నిర్మించబడుతుంది. దీని అంచనా వ్యయం దాదాపు రూ. 2000 కోట్లు. ఈ ప్రాజెక్టు పనులను కూడా త్వరలో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిఫెన్స్ భూముల బదలాయింపు ఒప్పందం పూర్తయిన తర్వాత భూసార పరీక్షలు నిర్వహించి పనులను ప్రారంభిస్తారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర 500 మీటర్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే, సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్ వంటి ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ కారిడార్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలో సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడను నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్లు పూర్తయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణం చేసే వీలుంటుంది.