SBI Multibagger Returns: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే చాలా మంది ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇందులో తెలివితో లాభాలు సంపాదించే వారు ఉంటారు. ఏం అవగాహన లేకుండా ఇందులోకి దూరి పెద్ద మొత్తంలో నష్టపోయిన వారు ఉంటారు. అయితే మంచి అవగాహన పెంపొందించుకొని.. స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. నిపుణుల సలహా తీసుకొని సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని దీర్ఘకాలం కొనసాగిస్తే అద్భుత రాబడి అందుకోవచ్చని చెబుతుంటారు. ఇంకా.. స్టాక్ మార్కెట్లలో ఐపీఓలు కాసుల పంట పండిస్తుంటాయి. మిగతా స్టాక్స్ విషయంలో చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తే.. ఐపీఓలు ఎక్కువగా లిస్టింగ్‌తోనే మంచి రాబడి ఇస్తుంటాయి. ఇక్కడ తొలిసారి పబ్లిక్‌కు వస్తున్న క్రమంలో ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో డిమాండ్ ఉంటుంది. విపరీతంగా బిడ్స్ దాఖలు చేస్తుంటారు. సక్సెస్‌ఫుల్‌గా మీకు లాట్ వస్తే లాభాల పంట పండినట్లేనని చెప్పుకోవచ్చు. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడైన క్రమంలో ఐపీఓల ఏడాది వ్యవధిలో పెద్దగా రాబడి అందించట్లేదు. కానీ వారం కిందట వచ్చిన ఒక ఐపీఓ కాసుల పంట పండిస్తోంది. అదే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL). ఇది లిస్టింగ్‌తో పెద్దగా లాభం అందించలేదు కానీ.. తర్వాత వరుస సెషన్లలో పుంజుకుంది. >> ఈ ఐపీఓ ఇష్యూ ధర రూ. 800 కాగా.. ఆగస్ట్ 6న BSE లో లిస్టింగ్ అయింది. కేవలం ఇష్యూ ధరలో 10 శాతం ప్రీమియంతో లిస్టయి.. మళ్లీ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఈ ఐపీఓ కోసం కనీస పెట్టుబడి రూ. 13,680 గా ఉంది. లిస్టింగ్‌తో ఇక్కడ సుమారు రూ. 1500 వరకు లాభం వచ్చింది. అయితే అక్కడితో ఆగలేదు. అక్కడి నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. 5 రోజుల్లోనే ఏకంగా 75 శాతానికిపైగా పెరిగి రూ. 1425 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక ప్రస్తుతం ఈ షేర్ ధర రూ. 1288.80 గా ఉంది. ఇది ఇష్యూ ధరతో పోలిస్తే 60 శాతం ఎక్కువ కావడం విశేషం. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే లాభపడలేదు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల కింద ఎస్బీఐ, ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ సహా ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆయా కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ వాటా రూపంలో కొనుగోలు చేస్తాయి. ఈ NSDL లో కూడా పెద్ద పెద్ద కంపెనీలకు వాటా ఉంది.దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కేవలం రూ. 2 చొప్పున ఏకంగా 60 లక్షల NSDL షేర్లను (దాదాపు 3 శాతం వాటా) కొనుగోలు చేసింది. ఇక్కడ కేవలం పెట్టుబడి రూ. 1.20 కోట్లు కాగా.. ప్రస్తుత ధర రూ. 1288.80 లెక్కన చూస్తే ఆ మొత్తం రూ. 773 కోట్లకు చేరింది. ఈ క్రమంలో ఎన్నో రెట్ల రాబడి అందుకుందని చెప్పొచ్చు.ఐడీబీఐ బ్యాంకుకు ఏకంగా NSDL లో దాదాపు 15 శాతం వాటాకు సమానమైన దాదాపు 2.99 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా షేరుకు రూ. 2 చొప్పున కొనుగోలు చేయగా.. ఈ మొత్తం ఇప్పుడు రూ. 3800 కోట్లకుపైగా చేరింది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయానికి వస్తే 1.38 లక్షల వరకు షేర్లు ఉన్నాయి. ఇది దాదాపు 6.95 శాతం వాటాకు సమానం. అయితే ఇది ఒక్కో షేరుకు రూ. 108.29 వెచ్చించింది. ఈ మొత్తం రూ. 1778 కోట్ల వరకు చేరింది.