తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గత వారం రోజుల నుంచి కూడా నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరే సమయంలో వర్షం లేకపోయినా.. మధ్యాహ్నం, లేదా సాయంత్రం నుంచి ఈ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రతీ ఏరియాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు, అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ హెచ్చరికల మధ్యే హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకుత్‌పురాలో ఒక సంఘటన జరిగింది. తన మేక కోసం ఆకులు కోయడానికి వెళ్లిన గౌస్ అనే వ్యక్తి.. ప్రమాదవశాత్తు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాలాలో జారిపడ్డాడు. ఆ నీటి ప్రవాహానికి అతడు అక్కడ నుంచి కొట్టుకుపోవాలి.. కానీ.. ఒక చెట్టు కొమ్మని పట్టుకొని ఆగిపోయాడు. ఈ పరిస్థితిని చూసిన స్థానికులు, కార్పొరేటర్ మహమ్మద్ వాసే సహాయంతో వెంటనే రంగంలోకి దిగి అతడిని రక్షించారు. గౌస్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వర్షాకాలంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి సమయంలో ధైర్యంగా స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన స్థానికుల ప్రయత్నం ఎంతో అభినందించవలసిన విషయం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో నాలా ప్రవాహాలకు దూరంగా ఉండాలి. వర్షాలు కురిసినప్పుడు నాలాలు, వాగులు, వంకలు ఉప్పొంగుతాయి. వాటిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఆ ప్రవాహాల దగ్గరకు వెళ్లకుండా చూసుకుంటే చాలా మంచిది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయినప్పుడు తెరుచుకున్న మ్యాన్‌హోల్స్ కనిపించవు వాహనదారులు, పాదచారులు జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షాలకు పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాంటి చోట్ల ఉండేవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళడం మంచిది. ఇక చివరగా.. నీరు నిలిచి ఉన్నప్పుడు విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండాలి.