ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతాలు, గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. 'అడవితల్లి బాట' పేరుతో జరుగుతున్న ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనుల రవాణా కష్టాలను తొలగించి, మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలోని 652 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అయిన పవన్ కళ్యాణ్.. ఆదివారం ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు.గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ.1,005 కోట్లు కేటాయించారు. ఈ నిధులు ప్రధానమంత్రి జన్ మన్ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధుల నుంచి సమకూరుతున్నాయి. ఈ రహదారి పనులు రెండు దశల్లో జరుగుతున్నాయి. అధికారులు ప్రతి రెండు వారాలకు ఒకసారి పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ శాఖ నుంచి అనుమతులు వేగవంతం చేయడానికి త్వరలో ఆ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అయితే అధికారులు ఈ ప్రాజెక్టులో ఎదురవుతున్న కొన్ని సవాళ్లను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణం కష్టంగా ఉందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పనుల్లో వేగం తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 186 రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని.. మరో 20 పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే వాటి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం గిరిజనులకు సరైన రోడ్ల సౌకర్యాలు లేకపోవటంతో కనీసం ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి కూడా ఉండట్లేదు. వారికి మౌళిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో కొత్త రోడ్లు నిర్మిస్తున్నారు.