MS Dhoni రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. 'ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్'పై వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైన తలా!

Wait 5 sec.

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంతోనే సీఎస్కే‌పై రెండేళ్ల పాటు బ్యాన్ కూడా విధించింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ జరగ్గా.. 2016, 2017లో సీఎస్కేను నిషేదించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఓనర్లే ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలోకి పేరును లాగడంపై ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. 2013 ఐపీఎల్ బెట్టింగ్ స్కాండల్‌లో తన పేరు లాగడంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశాడు. అయితే ఈ కేసును వేగవంతం చేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ధోనీ వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది. జస్టిస్ సీవీ కార్తికేయన్ ఈ కేసులో ధోనీ తరఫున సాక్ష్యాలు నమోదు చేయడానికి ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించారు. ధోనీ నేరుగా కోర్టుకు రాకుండానే ఆ అడ్వకేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నాడు. ధోనీ వ్యక్తిగతంగా కోర్టుకు వస్తే అభిమానుల రద్దీ కారణంగా గందరగోళం తలత్తే అవకాశం ఉండటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ధోనీ ఈ కేసును 2014లో దాఖలు చేశాడు. ఇద్దరు ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్, ఒక జర్నలిస్టు మీద తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారంటూ ధోనీ ఫిర్యాదు చేశారు. దాంతో తనకు రూ.100 కోట్ల నష్టం జరిగిందంటూ ఆయన ఆరోపించారు. ఐపీఎల్ బెట్టింగ్ స్కాండల్‌పై జరిగిన టీవీ డిబేట్‌లో వారు ఈ వ్యాఖ్యలు చేశారని ధోనీ స్పష్టంగా అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ధోనీ తరఫు సీనియర్ కౌన్సెల్ పీఆర్ రామన్ ఇటీవల ఓ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. దశాబ్దానికి పైగా ఈ కేసు వాయిదా పడుతూనే వస్తుందని, ఇకపై ఆలస్యం చేయకుండా విచారణ ప్రారంభించాలంటూ ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఉంది. విచారణ త్వరితగతిన పూర్తి చేయడానికి కోర్టుకు పూర్తిగా సహకరిస్తానంటూ ధోనీ కూడా పేర్కొన్నారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్‌ను ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద మచ్చగా పరిగణించొచ్చు. ఈ ఘటనలో ముగ్గురు క్రికెటర్లు దోషులుగా తేలగా.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు రెండేళ్ల పాటు సస్పెండ్ అయ్యాయి.