తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తే ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ఆ భక్తుడు, క్యూ లైన్‌లోకి వెళ్లాక

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు తీవ్రంగా గాయపడ్డారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 పైనుంచి జారిపడ్డారు. ఒడిశాకు చెందిన ఎల్లయ్యరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి దర్శనం కోసం మంగళవారం వచ్చారు. వారు సుదర్శన్ సత్రంలో గది తీసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సర్వదర్శనం కోసం వెళ్లారు. అయితే క్యూలైన్‌లో స్నేహితుల నుంచి ఎల్లయ్యరెడ్డి తప్పిపోయారు. ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్ రెండో అంతస్తుకు చేరుకునే క్రమంలో జారి కిందపడ్డారు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎవరూ గమనించలేదు. అతడి చేతులు, కాళ్లు విరిగిపోగా.. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం , పోలీసులు ఎల్లయ్యరెడ్డిని గుర్తించారు. వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 దగ్గర ఎల్లయ్య రెడ్డి కింద నుంచి పైఅంతస్తుకు గేట్లు పట్టుకుని ఎక్కే ప్రయత్నంలో జారి 25 అడుగుల కిందకు పడిపోయారని తెలుస్తోంది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మాధవ రాయుడు తిరుపతిలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం అవ్వాచారి కోనలోకి దూకాడు.. వెంటనే టీటీడీ భద్రతా సిబ్బంది అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా మాధవ రాయుడి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తిరుమల ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి దగ్గర ఉన్న అవ్వాచారి కోనలో దూకాడు. ఇది గమనించిన భక్తులు వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించారు. లోయలోకి దిగి అతన్ని రక్షించారు. అతడి కుడి చేయి విరిగిందని డాక్టర్లు తెలిపాు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు. ఈ మేరకు పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.