: . ఎక్కువగా పండగలు, ఫంక్షన్లు, ఇతర వేడుకల సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఇటీవలి కాలంలో ఇది అందని ద్రాక్షగా మారిపోతోంది. రేట్లు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే 22, 24 క్యారెట్స్ కాకుండా అంతకంటే తక్కువ నాణ్యత కలిగిన 18, 14 క్యారెట్లతో ఆభరణాలు చేయించుకోవడం.. లేదా ఇలా చేశారు. ఇంకొందరు మాత్రం.. "పసిడి కొనడం కష్టం.. వెండి ఆభరణాలనే చేయించుకుందాం!" అని సరిపెట్టుకుంటారు. కానీ, ఇకపై అది కూడా కష్టమయ్యేలా ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో అనూహ్యంగా దూసుకెళ్తున్నాయి. ఈ లోహం విలువ నిరంతరం పెరుగుతుండటంతో.. కిలో వెండి ధర రూ. 2 లక్షల మార్క్‌ను చేరుకోవడం కల కాదు, త్వరలో నిజం కానుంది! అవును, మీరు విన్నది నిజమే. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు మరి.అసలు ఇప్పుడు వెండి ధర ఎంతో తెలుసా..? ఎక్కడైనా విన్నారా..? ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర అక్షరాలా ఒక లక్షా 24 వేల రూపాయలుగా ఉంది. కొనుగోలు చేసినప్పుడు ఇతరత్రా ఛార్జీలతో కలిపి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. దీనికి ముందటి రోజు రూ. 1.25 లక్షలతో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక ప్రస్తుత డిమాండ్‌ను బట్టి చూస్తే షార్ట్ టర్మ్‌లో కేజీకి రూ. 1.40 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇంకాస్త ఆశ్చర్యకరంగా.. 2026 నాటికి అంటే సంవత్సరం తిరిగే లోపు కిలో వెండి ధర రూ. 2 లక్షలకు చేరొచ్చని చెప్పి షాకిచ్చారు. అయితే అసలు ఈ వెండి ర్యాలీకి కారణమేంటి? ఇది ఎవరికి మంచిది..? తెలుసుకుందాం. పారిశ్రామిక డిమాండ్, అనుకూల స్థూల ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా వెండి ధరలు పెరుగుతున్నాయి. పండగ సీజన్‌లో వెండి ఆభరణాల కోసం భారతదేశంలో వెండి వినియోగం బలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 30 శాతానికిపైగా పెరిగాయి. జనవరి సమయంలో సిల్వర్ రేటు కేజీకి రూ. లక్షకు దిగువనే ఉంది. ఇప్పుడు ఊహించని రీతిలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పారిశ్రామికంగా డిమాండ్‌తో పాటు విలువైన లోహం కారణంగా డిమాండ్‌ను పెంచుతోందని పృథ్విఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధానంగా శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయాలకు (గ్రీన్ ఆల్టర్‌నేటివ్స్) ప్రపంచం మారుతున్నందున, పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ వెండి పెరుగుదలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఇక్కడ సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎలక్ట్రానిక్స్‌లో పెరుగుతున్న వినియోగంతో పునరుత్పాదక ఇంధన రంగంలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. వీటికి అదనంగా.. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా వెండి ఒక రక్షణగా ఉండటం వల్ల సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య విధానాలలో అనిశ్చితి.. వెండి డిమాండ్‌ను మరింత పెంచింది. వాణిజ్య సుంకాలు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల యూఎస్ డాలర్ బలహీనపడటంతో డాలర్, బాండ్లు, మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నవారికి వెండి ఒక ప్రధాన పెట్టుబడి ఎంపికగా మారింది. ఇక్కడ మంచి లాభాలు కూడా వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దేశీయంగా, డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ తగ్గడం కూడా వెండి ధరల పెరుగుదలకు దోహదపడింది, ఇది భారతీయ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 2026 నాటికి వెండి కిలోకు రూ. 1,40,000; 2029 నాటికి రూ. 2 లక్షలకు చేరొచ్చని మనోజ్ కుమార్ జైన్ అంచనా వేస్తుండగా.. ఇదే సమయంలో ఆగ్‌మంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనాని మాత్రం 2026 నాటికే కేజీకి రూ. 2 లక్షలకు చేరొచ్చని భావిస్తున్నారు.