సుంకాల మోతకు సిద్ధమైపోయిన ట్రంప్.. ఆగస్ట్ ఒకటి నుంచే స్టార్ట్..

Wait 5 sec.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతకు సిద్ధమైపోయారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాలపై సుంకాల విధింపునకు ట్రంప్ రెడీ అయ్యారు. ఆయా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వచ్చే నెల (ఆగస్ట్) ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయెన్, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీంబామ్‌లకు డొనాల్డ్ ట్రంప్ లేఖలు రాశారు.అయితే మెక్సికో అధ్యక్షురాలికి రాసిన లేఖలో ట్రంప్ పలు విషయాలను ప్రస్తావించారు. అమెరికాలోకి అక్రమ వలసదారులను, అలాగే ఫెంటానిల్‌ రాకుండా అడ్డుకోవటంలో అమెరికాకు మెక్సికో సహాయపడిందని ట్రంప్ అంగీకరించారు. అయితే తమ దేశాన్ని నార్కో ట్రాఫికింగ్ కేంద్రంగా మారకుండా అడ్డుకోవడానికి మాత్రం చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. సరిహద్దు వద్ద మెక్సికో సాయపడుతున్నప్పటికీ.. అది అనుకున్నంతగా లేదని మెక్సికో ప్రెసిడెంట్‌కు రాసిన లేఖలో.. ట్రంప్ పెదవి విరిచారు. ఆ రకంగా ఓ వైపు సహాయం చేస్తున్నారంటూనే.. ఆ సహాయం తగినంతగా లేదని ఆక్షేపిస్తూ మెక్సికోపై సుంకాల మోతకు ట్రంప్ సిద్ధమైపోయారు. ఇక ఐరోపా యూనియన్‌కు రాసిన లేఖలోనూ డొనాల్డ్ ట్రంప్ పలు విషయాలను ప్రస్తావించారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందన్నారు. ఇక అమెరికాకు పొరుగున ఉన్న కెనడాపైనా ట్రంప్ సుంకాల బాంబు వేశారు. కెనడా నుంచి అమెరికాలోకి దిగుమతి చేసుకునే వస్తువులపైనా 35 శాతం ట్యాక్స్ వేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. వీటితో పాటుగా బ్రెజిల్, జపాన్ వంటి దేశాలపైనా 50 శాతం వరకూ వాణిజ్య సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచితే.. ఆయా దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దిగుమతి సుంకాల పెంపు వలన ఆయా దేశాలలో. ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉదాహరణకు ఏపీలో రొయ్యలపైనా ఇలాంటి ప్రభావమే గతంలో పడింది. అమెరికా దిగుమతి సుంకాలను పెంచడంతో ఏపీలో రొయ్యలు కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో రొయ్యల పెంపకం దారులు ఇబ్బందులు పడ్డారు.