తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భక్తులు.. తిరుమలకు వస్తుంటారు. అయితే తిరుమలలో ముందస్తు టికెట్ల బుకింగ్ కావాలంటే.. దాదాపు 3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. సర్వదర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం మార్గంలోనే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల భక్తులకు వీలైనంత తొందరగా.. చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. సెప్టెంబరు 7వ తేదీన చంద్ర గ్రహణం ఉన్న కారణంగా.. ఆరోజు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొన్ని గంటల పాటు మూసివేయనున్నట్లు తాజాగా టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) రోజున దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ఆ ప్రకటనలో వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం.. సెప్టెంబరు 7వ తేదీన రాత్రి 9.50 గంటలకు ప్రారంభం కానున్న చంద్రగ్రహణం.. ఆ రోజు అర్ధరాత్రి 1.31 గంటలకు ముగియనుందని టీటీడీ తెలిపింది. అయితే సాధారణంగా గ్రహణానికి 6 గంటల ముందు నుంచే శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయడం సంప్రదాయంగా వస్తోంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 3.50 గంటలకే ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం పూర్తి అయిన తర్వాత.. సెప్టెంబరు 8వ తేదీ (సోమవారం) రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో శ్రీవారి ఆలయ తలుపులను తెరిచి శుద్ధి చేసి, పుణ్యహవచనం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఏకాంతంగా తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు చేయనున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక చంద్ర గ్రహణం కారణంగా.. సెప్టెంబర్ 7 తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార వంటి సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుమలలో అన్న ప్రసాదం అందించడం నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 8.30 గంటల నుంచి అన్నప్రసాదాలను పంపిణీ చేయడం పునః ప్రారంభించనున్నట్లు పేర్కొంది.అన్నప్రసాదం రద్దు చేయనున్నట్లు తెలపడంతో ఆ రోజున తిరుమలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 30 వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేయనున్నరు. వీటిని సెప్టెంబరు 7 వ తేదీన సాయంత్రం నుంచి భక్తులకు పంపిణీ చేయన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న వైభోత్సవ మండ‌పంతోపాటు.. రామ్ భ‌గీచా, పీఏసీ-1, సీఆర్వో ఆఫీస్, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంట‌ర్లు, శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వద్ద ఈ పులిహోర ప్యాకెట్లను భక్తులకు అందించనున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ 7వ తేదీన తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు.. చంద్ర గ్రహణం ఉన్న విషయాన్ని గుర్తించి.. తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.