నచ్చకపోతే భారత వస్తువులు కొనకండి.. ట్రంప్‌ సుంకాలకు జైశంకర్ కౌంటర్

Wait 5 sec.

రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవడంపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మన దేశంపై టారిఫ్‌ల పిడుగు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమల్లోకి రాగా.. త్వరలోనే మరో 25 శాతం టారిఫ్‌లను విధించనున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా ఆయిల్ కొనడం ఆపకపోతే.. భారత్‌ మరిన్ని టారిఫ్‌లు ఎదుర్కొక తప్పదని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి గట్టిగా స్పందించారు. అమెరికాకు నచ్చకపోతే భారత వస్తువులను కొనొద్దని తేల్చి చెప్పారు. భారత ఉత్పత్తులను కొనాలని అమెరికాను ఎవరూ బలవంతం చేయరని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2025లో పాల్గొని ప్రసంగించిన జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం లేదని జైశంకర్ తేల్చి చెప్పారు. ఇది కేవలం ప్రపంచ మార్కెట్ విధానాలు.. భారతదేశ అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలపై అమెరికా పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. రష్యా నుంచి భారత్ మాత్రమే చమురు కొనుగోలు చేయడం లేదని.. భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి చైనా ఆయిల్ కొనుగోళ్లు చేస్తోందని తెలిపారు. అయినప్పటికీ చైనాపై మాత్రం ట్రంప్ ఎలాంటి సుంకాలు విధించడం లేదని గుర్తు చేశారు.ఈ సందర్భంగా తమ ప్రభుత్వానికి.. తమ దేశ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యం అని జైశంకర్ తేల్చి చెప్పారు. భారత్‌లోని రైతులు, చిన్న ఉత్పత్తిదారులను కాపాడేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ఇందులో తాము ఏ దేశంతోనూ రాజీపడేది లేదని వెల్లడించారు. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తాము నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గతంలో ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లను స్థిరంగా ఉంచేందుకు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని భారత్‌ను స్వయంగా అమెరికానే ప్రోత్సహించిన విషయాన్ని ఈ సందర్భంగా జైశంకర్ గుర్తు చేశారు.ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చైనాతోపాటు యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు కూడా చమురు కొనుగోళ్లు జరుపుతున్నాయని.. అయినా ఆ దేశాలపై మాత్రం అమెరికా సుంకాలు పెంచలేదని జైశంకర్ స్పష్టం చేశారు. చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తులను భారత్ నుంచి కొనుగోలు చేయడంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు కొనొద్దని జైశంకర్ తెలిపారు. తమ దేశం నుంచి కొనుగోళ్లు జరపాలని ఏ దేశాన్ని తాము బలవంతం చేయబోమని స్పష్టం చేశారు. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తము కొన్ని నిబంధనలు విధించామని.. కాబట్టి వాటిని దాటి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేమని తెలిపారు.