ఎట్టకేలకు సిరాజ్‌ను ఎందుకు రిటైన్ చేసుకోలేదో చెప్పిన ఆర్సీబీ..!

Wait 5 sec.

ఐపీఎల్ ప్రారంభ సీజన్‌ నుంచి ఆడుతున్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఐపీఎల్ 2025కి ముందు వరకు మూడు సార్లు ఫైనల్‌లో చతికిలపడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025కి ముందు జరిగిన వేలంలో జట్టును ప్రక్షాళన చేసింది. ఈ క్రమంలో ఏడేళ్లుగా జట్టులో భాగమైన పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను సైతం వదిలేసుకుంది. అయినా అనుకున్నట్లుగానే జట్టును నిర్మించుకుని 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపేందుకు సిరాజ్.. శాయశక్తులా ప్రయత్నించాడనే చెప్పొచ్చు. కానీ అతడు ఆర్సీబీలో ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు మహమ్మద్ సిరాజ్‌ను ఎందుకు వేలంలోకి వదిలేయాల్సి వచ్చింది? ఆ తర్వాత అతడిని ఎందుకు తీసుకోలేకపోయాం? అనే విషయాలను క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ తాజాగా వెల్ల‌డించారు. “ఐపీఎల్ మెగా వేలంలో భారత అంతర్జాతీయ బౌలర్లను ద‌క్కించుకోవ‌డం అంత ఈజీగా కాదు. మహమ్మద్ సిరాజ్‌ను జ‌ట్టులో ఉంచుకోవాలా? విడుదల చేయాలా? లేదా రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలా? అనే విషయంలో సుదీర్ఘంగా ఆలోచించాం. దీనికి సంబంధించిన‌ ప్రతి విషయాన్ని మేము సిరాజ్‌తో చర్చించాం (అయితే అది నేరుగా కాదు). కొత్త బంతితో పాటు డెత్ ఓవ‌ర్ల‌లోనూ బౌలింగ్ చేయ‌గ‌ల భువనేశ్వర్ కుమార్‌ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని ముందు నుంచీ అనుకున్నాం. ఇది జరగాలంటే సిరాజ్‌ను కొన‌సాగించ‌డం కుద‌ర‌ద‌ని అర్థమైంది. దీంతో పాటు ఇతర అంశాలు కూడా ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమయ్యాయి. మేం మా సమావేశాల్లో ఎక్కువగా సిరాజ్‌ గురించే చర్చించాం” అని బోబాట్ చెప్పారు. గాయంతో అందుబాటులో లేకపోవడంతోనే కామెరూన్ గ్రీన్‌ను రిటైన్ చేసుకోలేదని వెల్లడించారు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ అనుకున్నట్లుగానే బౌలింగ్ యూనిట్‌ బలంగా మార్చుకుంది. హేజిల్‌వుడ్‌ను రూ.12.50 కోట్లకు, భువనేశ్వర్‌ను రూ.10.75 కోట్లకు ద‌క్కించుకుంది. ఐపీఎల్ 2025లో భువీ 17 వికెట్లు, హేజిల్‌వుడ్‌ 22 వికెట్లు తీసి.. ఆర్సీబీ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక మహమ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్.. రూ.12.25 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. సిరాజ్ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. ఆర్సీబీ తరఫున ఏడు సీజన్‌లు ఆడిన సిరాజ్.. 102 మ్యాచ్‌లలో 99 వికెట్లు పడగొట్టాడు.