ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఏకంగా రూ.52 వేల కోట్లు, ఆసియాలోనే అతిపెద్దది

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో.. కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్నాయి. కొత్తగా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడంతోపాటు ఉన్న కంపెనీలను విస్తరిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంలోనే చాలా కంపెనీలు ఏపీ వైపు చూడగా.. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటికి వచ్చింది.ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ ఏపీలోని విశాఖలో ఏర్పాటు కాబోతున్నట్లు వస్తున్న వార్తలను ఇన్వెస్ట్‌ ఇండియా సంస్థ ఎక్స్‌లో ధృవీకరిస్తూ ఒక పోస్ట్ చేసింది. ఇక ఈ ఏపీలో ఏర్పాటు కావడంపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా వెల్లడించడం గమనార్హం. 6 బిలియన్‌ అమెరికన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.52,560 కోట్లతో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం కానున్నట్లు తెలుస్తోంది. ఇక గూగుల్ డేటా సెంటర్‌లో గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుందని నిపుణులు పేర్కొంటున్నారు. 3 సముద్రపు కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ల ద్వారా.. విశాఖలో ఈ గూగుల్ డేటా సెంటర్ కేంద్రం ఏర్పాటు కానుంది. ముంబైకి రెండు రెట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. మరోవైపు.. హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా ఉన్న హైటెక్‌ సిటీ లాగా.. విశాఖలోని మధురవాడ వద్ద 500 ఎకరాల్లో డేటా సిటీని డెవలప్ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందులో హౌసింగ్‌ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బిగ్‌ డేటా, డీప్‌ టెక్నాలజీ, ఏఐ వంటి రంగాల్లో.. ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. వాటిని ఏపీ ప్రజలు అందిపుచ్చుకునేందుకు ఈ డేటా సిటీ ఉపయోగపడుతుందని భావించి.. దానిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖ నగరంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా.. ఈ డేటా సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు వచ్చే ఐటీ కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలనేదే ఏపీ ప్రభుత్వ ఆలోచన అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.