ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడకు సమీపంలో నగర పంచాయతీగా ఉన్న ఉయ్యూరును గ్రేడ్ 02 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉయ్యూరును అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌన్సిల్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. 2020-21 నుంచి 2024-25 వరకు నగర పంచాయతీ ఆదాయ వివరాలను నివేదిక రూపంలో అందజేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. ఉయ్యూరుకు మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ) గెజిట్‌ను విడుదల చేసింది. మొత్తానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉయ్యూరు ప్రజల కల నెరవేరింది. ఉయ్యూరు ఇకపై నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చేందుకు మార్చి 17న కౌన్సిల్‌లో దీనికి సంబంధించిన తీర్మానం చేశారు. ఉయ్యూరుకు వచ్చే ఆదాయం, జనాభా పెరుగుదల వంటి అంశాలను పరిశీలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉయ్యూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తాయి. ఉయ్యూరు గతంలో పంచాయతీగా ఉండేది.. 2011లో దానిని నగర పంచాయతీగా మార్చారు. ఇప్పుడు దాని స్థాయి మరింత పెరిగింది.. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా మారింది. ఉయ్యూరులో వనరులు బాగా ఉన్నాయి. ఆదాయం, జనాభా కూడా పెరుగుతోంది. పట్టణం కూడా విస్తరిస్తోంది.. ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించింది. అందుకే మున్సిపాలిటీగా మార్చడానికి అంగీకరించింది.ప్రస్తుతం ఉయ్యూరులో 20 వార్డులు ఉన్నాయి.. ఇక్కడ 2500 టిడ్కో గృహాలతో పాటుగా 2450 జగనన్న కాలనీ ప్లాట్లు కూడా ఉన్నాయి. గత పదేళ్లలో పట్టణం బాగా అభివృద్ధి చెందింది. ఉయ్యూరులో ఆదాయం కూడా రూ.5 కోట్లకు పెరిగింది. మున్సిపాలిటీగా మారడం వల్ల ఉయ్యూరుకు ఎక్కువ నిధులు వస్తాయి. దీని ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. ఉయ్యూరువాసులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.