రైళ్లలో ప్రయాణిస్తున్నామంటేనే.. డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, బ్యాగులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. దొంగలు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా వస్తారో తెలియదు కాబట్టి.. ముందు జాగ్రత్త మంచిది. ఇక స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు ఎప్పటికప్పుడు దొంగల భరతం పడుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే దొంగలు.. రోజు రోజుకూ అప్‌డేట్ అవుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ.. రైల్వే అధికారులు, పోలీసులకు పెను సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రైలులో జరిగిన దొంగతనం ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన గురించి తెలిసి.. రైళ్లలో ప్రయాణించేవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని నాగర్‌సోల్ నుంచి నరసాపురం వస్తున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టంచారు. రైలు పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం సమీపంలోకి మంగళవారం తెల్లవారుజామున 2.47 గంటలకే చేరుకుంది. ఈ క్రమంలోనే 146/06 మైలురాయి వద్ద ఈ ఘటన జరిగింది. మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో పట్టాల పక్కన ఉన్న హోమ్ సిగ్నల్‌లను దుండగులు ను ట్యాంపర్ చేశారు. దీంతో అక్కడ రెడ్ సిగ్నల్ పడటంతో రైలును లోకో పైలట్ నిలిపివేశారు.రైలు ఆగగానే.. దొంగల ముఠా సభ్యులు హుటాహుటిన రైలులోకి చొరబడ్డారు. ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోని మహిళల మెడలో ఉన్న 68 గ్రాముల బంగారు చైన్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఓ మహిళ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ గొలుసును కూడా దోచుకెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఎస్-5 బోగిలోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడ కూడా చోరీకి విశ్వ ప్రయత్నాలు చేయగా.. అందులో ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో వారు పరారయ్యారు. అర్ధరాత్రి పూట ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైలులో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఇక రెడ్ సిగ్నల్ పడటంతో ఆ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. అక్కడే దాదాపు 35 నిమిషాలపాటు నిలిచిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై రమేష్ వెల్లడించారు. అయితే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రతా సిబ్బంది లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఒంగోలు, రేణిగుంట సమీపంలో ముంగిలిపట్టు.. తెలంగాణలోని అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల వంటి రైల్వే స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఘటనలు జరిగినట్లు రైల్వే పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇక ఇదే రకంగా చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలును.. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం కోమలి ప్రాంతంలో సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి.. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును తీసుకుని పరారయ్యారు.రైల్వే సిగ్నల్‌లను ను ట్యాంపరింగ్‌ చేసేందుకు దోపిడీదారులు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. రైల్వే స్టేషన్లకు దగ్గర్లో ఉండే సిగ్నళ్లను ట్యాంపరింగ్ చేయడానికి వీలుగా వాటికి అనుసంధానమై ఉండే జంక్షన్‌ బాక్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యేలా చేస్తున్నారు. ఇందుకోసం రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థకు సంబంధించిన సర్క్యూట్‌ బోర్డును పగలగొట్టి.. తద్వారా ఎలాంటి సిగ్నళ్లు పడకుండా చేస్తున్నారు. చివరికి రైలును ఆపేందుకు రెడ్‌ సిగ్నల్స్ పడేలా చేస్తున్నారు. సిగ్నల్‌ సిస్టమ్ వైర్లను కట్ చేసి.. సిగ్నల్స్ పడకుండా చేసి రైలును అక్కడే ఆపేలా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లోకో పైలెట్‌కు సిగ్నల్స్‌ కనించకుండా ఉండేందుకు.. లైట్లకు ఒక వస్త్రాన్ని చుడుతున్నారు. దాంతో సిగ్నల్ కనిపించక.. లోకో పైలట్‌ రైలును ఆపాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు.