దేశ వ్యాప్తంగా కేంద్రం వందేభారత్ రైళ్లను నడుపుతోంది.. ప్రధాన నగరాల మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో నడుస్తున్నాయి. అయితే కేంద్రం డిమాండ్ ఉన్న మార్గాల్లో కొత్తగా వందేభారత్ రైళ్లను ఏర్పాటు చేస్తోంది.. అలాగే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనల్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లను కేటాయిస్తున్నారు. ఇటీవల పలు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరికొన్ని రూట్లలో కూడా వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఏపీ నుంచి రెండు కొత్త వందేభారత్ రైళ్లు నడపాలని ప్రతిపాదిస్తున్నారు.ఏపీలోని విశాఖపట్నం- బెంగళూరుకు మధ్య కొత్త రైళ్లు, విశాఖపట్నం- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడపాలని కేంద్రాన్ని కోరామన్నా ఎంపీ శ్రీ భరత్. ఈ కొత్త వందేభారత్, కొత్త రైళ్ల ప్రతిపాదనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. అంతేకాదు మంగళపాలెం దగ్గర ఆర్‌యూబీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.. అక్కడ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. విశాఖపట్నం రైల్వే జోన్‌‌కు సంబంధించిన కార్యకలాపాలు త్వరలో మొదలవుతాయని తెలియజేశారు. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. ఎవరూ నమ్మొద్దని కోరారు. విశాఖపట్నం-తిరుపతి వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే తిరుమల వెళ్లే భక్తులకు పండగే.మరోవైపు విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపుకోట (ఎస్ కోట) నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి పంపినట్లు ఎంపీ శ్రీ భరత్‌ తెలిపారు. ఈ నిర్ణయంపై సానుకూల స్పందన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను క్లియర్ చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందజేశామన్నారు. 'దక్షిణ భారత నోడల్‌ హబ్‌గా విశాఖపట్నంలో డిజేబిలిటీ స్పోర్ట్స్‌ సెంటర్, మార్షల్‌ ఆర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదన పంపించాము' అన్నారు. విశాఖపట్నం నుంచి ఒకటి, రెండు ను నడపాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు, విశాఖపట్నం నుంచి చెన్నైకు లను నడపాలని గతంలో కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి బెంగళూరుకు, విశాఖపట్నం నుంచి తిరుపతికి వందేభారత్ రైలు నడపాలని కోరుతున్నారు. మరి ఈ ప్రతిపాదనలపై రైల్వేశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటుగా పలు రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఏపీ మీదుగా నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కూడా రైల్వేమంత్రిని కోరారు. ఇప్పటికే హిందూపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు ఆగేందుకు రైల్వేమంత్రి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.