: సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. సామాన్యులకు దీపావళి కానుక ప్రకటించారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో సంస్కరణలు చేసి పన్ను భారాన్ని తగ్గిస్తామన్నారు. వచ్చే దీపావళి నాటికి జీఎస్‌టీ పన్ను రేట్లను తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, ఇప్పుడు ఈ చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యులకు నిజంగా దీపావళి పండగ ముందే వచ్చినట్లవుతుంది. చాలా వస్తువుల ధరలు దిగివస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ జీఎస్టీ సంస్కరణలపై తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్‌లో పండగల సీజన్ డిమాండ్‌ను పెంచేందుకు జీఎస్‌టీ రేట్ల తగ్గింపును సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి తీసుకురావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నారు. వచ్చే దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభయ్యే క్రమంలోనే అంటే సెప్టెంబర్ 22 వ తేదీనే కొత్త జీఎస్‌టీ ట్యాక్స్ రేట్లను అమలులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ వచ్చే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 5, 18 శాతం జీఎస్టీ శ్లాబులపై చర్చించనుంది. ఈ సమావేశం తర్వాత 5 రోజుల్లోనే దీనిపై నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది. అలాగే ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ తగ్గింపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల మండలి కొద్ది రోజుల క్రితమే సమావేశమై జీఎస్టీ‌లో 2 శ్లాబుల విధానానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 5, 12, 18 28 శ్లాబుల్లో 12, 28 తొలగించి 5, 18 శ్లాబులను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఇక అల్ట్రా లగ్జరీ కార్స్, సైన్ గూడ్స్ వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రం కొత్త శ్లాబ్ 40 శాతం తీసుకురావాలని ప్రతిపాదించారు. అలాగే కొన్ని కార్మిక సంబంధత వస్తువుల రేట్లు 0.1 శాతం, 0.3 శాతం, 0.5 శాతం రేట్లలోను కొనసాగనున్నాయి.