నేపాల్ మీదుగా బీహార్‌లోకి ముగ్గురు జైషే ఉగ్రవాదుల చొరబాటు.. రాష్ట్రంలో హైఅలర్ట్

Wait 5 sec.

: పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు జేషే మహ్మద్ ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో.. బీహార్ అప్రమత్తం అయింది. ముఖ్యంగా బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ గురువారం రోజు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి పేర్లు, ఇతర వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్ మీదిగా బీహార్‌లోకి చొరబడ్డట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాలతో పాటు మొత్తం రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఆ ముగ్గురూ జైషే మహ్మద్ ఉగ్రవాదులే..నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అనుమానిత ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి, పాకిస్థాన్), అదిల్ హుస్సేన్ (ఉమర్‌కోట్, పాకిస్థాన్), మహమ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్, పాకిస్థాన్)గా గుర్తించారు. వీరు ముగ్గురూ ఆగస్టు మొదటి వారంలో కాఠ్మాండుకు చేరుకుని ఆ తర్వాత గత వారం బీహార్‌లోని సుపౌల్ జిల్లా గుండా భారత్‌లోకి చొరబడినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదుల చొరబాటుతో బీహార్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా..పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు సరిహద్దు జిల్లాలు అయిన మధుబని, సీతామఢీ, సుపౌల్, అరేరియా, తూర్పు, పశ్చిమ చంపారన్‌లలో భద్రతా ఏజెన్సీలు నిఘా, గూఢచార సేకరణను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదుల పాస్‌పోర్ట్ వివరాలు, ఫోటోలను సరిహద్దుల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో వాహనాలను, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ముగ్గురు ముష్కరుల కోసం రాష్ట్రం మొత్తం గాలింపు..ఈ ఉగ్రవాదుల చొరబాటు బెదిరింపు రాకముందే.. మే నెలలో ప్రారంభమైన 'ఆపరేషన్ సింధూర్' కారణంగా ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో, అలాగే సీమాంచల్ జిల్లాల్లో భద్రతను పెంచారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడే పర్యటిస్తుండగా.. మరింత మంది పోలీసులు ఆయనకు పహారా కాస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదుల చొరబాటు వార్త రాగా.. అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా బీహార్ పోలీసులు మొత్తం ముగ్గురు ముష్కరుల కోసం రాష్ట్రం మొత్తం గాలిస్తున్నారు.