డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నుంచి అమెరికాలోని వలసదారులకు కంటిమీద కునుకు కరవయ్యింది. ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న ట్రంప్ యంత్రాంగం.. తాజాగా, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ఐదున్నర కోట్ల మందికిపైగా విదేశీయులన విసా వివరాలను పునఃసమీక్షిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్టు గుర్తిస్తే వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికా ఉంటున్నా, క్రిమినల్ చర్యలకు పాల్పడినా, ప్రజాభద్రతకు ప్రమాదం తలపెట్టేలా తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోన్న విదేశీయులను వెనక్కు పంపుతామని విదేశాంగ శాఖ స్పష్టం చేసినట్టు’ సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాదు, ఉగ్రవాద సంస్థలకు ఎటువంటి సహాయం అందించినా తక్షణమే వీసా రద్దుచేసి, అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.కాగా, ఇటీవల కాలంలో అమెరికా యంత్రాంగం చేపట్టిన అతిపెద్ద వీసా సమీక్ష ఇదే కావడం గమనార్హం. పర్యాటకులు, ఫారిన్ స్టూడెంట్స్, ఎక్సేంజ్ వీసాహోల్డర్లు వంటి వివిధ వర్గాలపై ఈ చర్యలు ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, చట్టప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుందా? లేదా? అని వలసదారుల హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.‘విదేశీ వీసాదారులకు సంబంధించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని సమీక్షించి.. సోషల్ మీడియా ఖాతాలు, ఇమిగ్రేషన్ రికార్డులు, పోలీసు శాఖ సమాచారం, ఇతర అంశాలను పరిశీలిస్తాం’ అని అధికార వర్గాలు తెలిపాయి. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అంచనా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 12.8 మిలియన్ల మంది గ్రీన్‌కార్డుదారులు, 3.6 మిలియన్ల మంది తాత్కాలిక వీసాదారులు ఉన్నారు. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ మొత్తం 6 వేల వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వీసా గడువు ముగిసినా దేశాన్ని వీడకపోవడం, నేరాలకు పాల్పడటం, మద్యం మత్తులో డ్రైవింగ్, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు దిగిన వారి వీసాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. ఉగ్రవాదానికి మద్దుతు ఇచ్చిన కారణంగా సుమారు 200 నుంచి 300 మంది వీసాలను రద్దు చేసినట్టు కూడా పేర్కొంది. సమీక్షించే 55 మిలియన్ల మంది వీసాదారుల్లో ప్రస్తుతం దేశం వెలుపల ఉండే మల్లిపుల్ ఎంట్రీ టూరిస్ట్‌ వీసాదారులు ఉన్నారు.విస్తృత వీసా సమీక్షతో పాటు వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయడాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ‘అమెరికా రోడ్లపై పెద్ద ట్రాక్టర్-ట్రైలర్ ట్రక్కులను నడుపుతున్న విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరగడం అమెరికన్ల జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది.. అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది" అని రూబియో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.మరోవైపు, విదేశీ విద్యార్థులు, పర్యాటకులకు వీసాల జారీ ట్రంప్ సర్కారు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. వీసాదారులు తప్పనిసరిగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన అనేక మినహాయింపులను రద్దు చేసింది. అంతేకాదు, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల పోస్ట్‌లు, కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీసాలు మంజూరు చేయాలని వివిధ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను ట్రంప్ యంత్రాంగం ఆదేశించింది.