ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాయి. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్ ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లను శ్రీలంక కట్టడి చేస్తే.. లంక లైనప్‌ను ఇంగ్లిష్ బౌలర్లు కుప్పకూల్చారు. బౌలర్ల ఆధిపత్యం సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్ 8 గ్రూప్ 2లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లంక బౌలర్లు కూడా అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 62 పరుగులతో రాణించడం, ఆఖర్లో విల్ జాక్స్ కొద్దిసేపు పోరాడటంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 147 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న పాతుమ్ నిస్సంకాను ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. దాంతో శ్రీలంక 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కుశాల్ మెండిస్‌ను విల్ జాక్స్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే పవన్ రత్నాయకే కూడా డకౌట్ అయ్యాడు. దాంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కుశాల్ మిషారాను జోఫ్రా అవుట్ చేయడం, దునిత్ వెల్లలాగే కూడా అవుటవ్వడంతో శ్రీలంక పవర్ ప్లే లోపే సగం వికెట్లు కోల్పోయింది. 34 పరుగులే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న లంకను కెప్టెన్ శానక ఆదుకున్నాడు. ఈ క్రమంలో నిదానంగా ఆడుతున్న కమిందు మెండిస్‌ను డాసన్ అవుట్ చేశాడు. దాంతో 52 పరుగులకే ఆరు వికెట్ల కోల్పోయింది. కెప్టెన్ శానక 30 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక్కళ్లు కూడా నిలకడగా రాణించలేకపోవడంతో లంక ఓటమి తప్పలేదు. 16.4 ఓవర్లలో కేవలం 95 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. శ్రీలంక జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం కనబరిచాడరు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చారు. శ్రీలంక జట్టులో దునిత్ వెల్లలాగే మూడు వికెట్లు, మహీష్ తీక్షణ రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ జట్టులో విల్ జాక్స్ మూడు వికెట్లు, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ చెరు రెండు వికెట్లు దక్కించుకున్నారు.