వాంఖడేలో విండీస్ గ్రాండ్ విక్టరీ.. ఆఖరి వికెట్ వరకూ పోరాడి ఓడిన జింబాబ్వే

Wait 5 sec.

దెబ్బకు జింబాబ్వే నిలబడలేకపోయింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఆఖరి వికెట్ వరకూ జింబాబ్వే ఆటగాళ్లు పోరాడటం విశేషం. కెప్టెన్ కూడా విఫలమవ్వడంతో జింబాబ్వే మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఆఖర్లో ఎవాన్స్ పోరాడటంతో దారుణ ఓటమి నుంచి జింబాబ్వే బయటపడింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 147 పరుగులకు ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే జట్టు భారీ మూల్యాన్ని చెల్లించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో హెట్మెయర్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో 85 పరుగులు చేయడం.. రోవ్‌మన్ పావెల్ కూడా హాఫ్ సెంచరీ బాదగా, ఆఖర్లో రూధర్‌ఫోర్డ్ హిట్టింగ్ చేయడంతో విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు మంచి ఆరంభమే ఇచ్చినా పవర్ ప్లేలోనే చతికిలపడింది. మూడో ఓవర్‌లో అకీల్ హోసెన్ వరుస వికెట్లు తీయడంతో మూడో ఓవర్‌కే జింబాబ్వే జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఇక పదకొండో ఓవర్‌లో గుడకేశ్ మోటి కూడా వరుస బంతుల్లో సికందర్ రజా, ముసేకివాను పెవిలియన్‌కు పంపడంతో జింబాబ్వే ఓటమి ఖరారయింది. అయితే, ఆఖర్లో బ్రాడ్ ఎవాన్స్ సిక్సర్ల మోత మోగించి దారుణ పరాజయం నుంచి తప్పించాడు. జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లగా.. జింబాబ్వే నాలుగో స్థానానికి వచ్చింది. సౌతాఫ్రికా 2, ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. జింబాబ్వే జట్టులో మారుమని 14 (8), బ్రియన్ బెన్నెట్ 5 (5), డియాన్ మైయర్స్ 28 (15), ర్యాన్ బర్ల్ 0 (3), సికందర్ రజా 27 (20), టోనీ మున్యోంగా 14 (16), తషింగా ముసేకివా 0 (1), బ్రాడ్ ఎవాన్స్ 43 (21), గ్రేమ్ క్రీమర్ 0 (6), రిచర్డ్ నగారావా 7 (6) నాటౌట్, బ్లెస్సింగ్ ముజరబానీ 0 (5). వెస్టిండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటి 4 ఓవర్లలో ఒక మేడిన్ వేసి 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అకీలా హోసెన్ కూడా ఒక మేడిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు.