బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీకి 1085 ఎలక్ట్రిక్ బస్సులు

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రన్స్‌జెండర్లకు జీరో టికెట్ ద్వారా ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తుంది. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండటం లేదు. పథకం ప్రారంభానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నిత్యం బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య 25 లక్షల వరకు ఉంటే ప్రస్తుతం 60 లక్షలు దాటినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక పాత బస్సులు కొన్నిచోట్ల మెురాయిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది. తాజాగా.. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఆర్టీసీకి 1085 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు టీజీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOC) జారీ చేసింది. పీఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, ఈవీ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. తెలంగాణ ఆర్టీసీకి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఏసీ, నాన్-ఏసీ రెండు రకాల బస్సులున్నాయి. రాష్ట్రంలోని స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో డిజైన్ చేశారు. ఈ బస్సులను ఒక్కసారి చార్జ్‌ చేస్తే చాలా 250 కిలోమీటర్లకుపైగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. సుమారు 45 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ బస్సులో వీల్‌చైర్ ప్రయాణికులకు కూడా ప్రత్యేక స్థలం కేటాయించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 3600కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఓలెక్ట్రా చేతిలో ప్రస్తుతం మరో 10 వేల ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఉంది. మేక్ ఇన్ ఇండియా దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తున్నామని ఒలెక్ట్రా ఎండీ మహేశ్ బాబు తెలిపారు. కాగా, ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు రద్దీ టెన్షన్ లేకుండా హాయిగా ప్రయాణించొచ్చు.