ఏపీలో విభిన్న వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది.. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సోమవారం రోజు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 1 నుంచి 2 డిగ్రీలు పెరిగాయి. కాకినాడ జిల్లా తుని, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎండల సంగతి అలా ఉంటే.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఇవాళ అల్పపీడనంగా బలహీనపడనుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి బలహీనపడుతుందని అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలోని పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిలబడకూడదన్నారు. ఇదిలా ఉంటే సోమవారం అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా సాలూరులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది.. అలాగే ఈదురుగాలులు కూడా వీచాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో జనాలు ఆశ్చర్చపోయారు. సాలూరులో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంది. అయితే ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై.. బలైనమ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. వర్షం దెబ్బకు జనాలు ఇబ్బందిపడ్డారు. మరికొన్ని చోట్ల కూడా చిరు జల్లులు కురిశాయి. అలాగే పడుతున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. మొత్తం మీద ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపించింది. ఓవైపు ఎండ దంచి కొడితే.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది.. సాయంత్రానికి వర్షం పడింది. అయితే ఇక ఎండలు పెరిగిపోతాయని.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.