కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్‌ పథకంలో భాగంగా తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో కూడా అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ ఆధునీకరణ పనులను మరింత వేగవంతం చేయాలని స్థానికులు, ప్రయాణికులు.. దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరుతున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి.. ఉగాది నాటికి ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అప్‌గ్రేడెడ్ స్టేషన్‌ను తెలుగు సంవత్సరాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు దాదాపు 90 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా ప్లాట్‌ఫారమ్‌ల మధ్య భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. స్టేషన్‌లో ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫారమ్‌ నుంచి మరో ప్లాట్‌ఫారమ్‌లపైకి సులభగా రాకపోకలు సాగించేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో పశ్చిమ వైపున ఉన్న టెర్మినల్-2 వద్ద ఇన్, అవుట్ గేట్ల వద్ద అలంకార తోరణాల పనులు పూర్తి చేశారు. తూర్పు వైపు ద్వారం వద్ద కూడా ఇలాంటి పనులే శరవేగంగా చేస్తున్నారు.ఇక రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, టీ స్టాల్, ప్లాట్‌ఫారమ్‌పై ఆర్‌పీఎఫ్ ఆఫీస్ వంటి కీలక వసతులకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికే రెడీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ బుకింగ్ ఆఫీస్‌లో ఫాల్ సీలింగ్ పనులు చేస్తున్నారు. స్టేషన్ ఆవరణలో సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ వేయడంతో పాటు.. హై మాస్ట్ లైటింగ్ కోసం పునాదులు తీస్తున్నారు. స్టేషన్ భవనం పైన ఎలివేషన్, పోర్టికో పనులు తుది దశకు చేరుకున్నాయి.గౌతమ్‌నగర్ గేట్ రోడ్డు నుంచి బుకింగ్ ఆఫీస్ వరకు కొత్తగా సిమెంట్ కాంక్రీట్ అప్రోచ్ రోడ్డును వేశారు. ఇది అనుటెక్స్ చౌరస్తా వైపు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఈ కొత్త సీసీ రోడ్డు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది.మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే అధికారులకు.. సబర్బన్ రైలు ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి, జెడ్ఆర్‌యూసీసీ సభ్యుడు నూర్ అహ్మద్ అలీ ధన్యవాదాలు చెప్పారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి.. ఉగాది పండగ కానుకగా రైల్వే స్టేషన్‌ను పునఃప్రారంభించాలని కోరుతున్నారు. అదే విధంగా మల్కాజ్‌గిరి మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఈ స్టేషన్‌లో స్టాపేజ్ కల్పించాలని అలీ విజ్ఞప్తి చేశారు.