Anthropic: అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస ప్రకటనలతో సంచలనాలు సృష్టిస్తోంది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ కంపెనీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రకంపనలు సృష్టించింది. సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లను కుప్పకూల్చేసింది. అమెరికా మార్కెట్లో ఈ సంస్థ ప్రకటించిన సరికొత్త ఏఐ ఫిచర్ క్లాడ్ కోడ్ సెక్యూరిటీతో సెబర్ సెక్యూరిటీల కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 10 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.90,700లకు పైగా సంపద ఆవిరైపోయింది. సాఫ్ట్‌వేర్ కోడ్ రాసిన తర్వాత అందులోని భద్రతాలోపాలను గుర్తించేందుకు ఐటీ డెవలపర్లు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే ఆంథ్రోపిక్ కొత్త టూల్ సాఫ్ట్‌వేర్ కోడ్‌బేస్‌లను స్కాన్ చేసి లోపాలను క్షణాల్లో గుర్తిస్తుంది. సెక్యూరిటీ రీసెర్చర్లు ఎలాగైతే డేటా ఫ్లోను అర్థం చేసుకుంటారో అదే స్థాయిలో ఈ సైతం పని చేస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో దొరకని చిన్న చిన్న లోపాలను కూడా చాలా ఈజీగా పసిగడుతుంది. వాటిని సరిదిద్దేందుకు ఉన్న మార్గాలు సూచిస్తుంది. ఇప్పటికే కంపెనీ చేపట్టిన అంతర్గత పరీక్షల్లో ఈ ఏఐ టూల్ 500కు పైగా క్లిష్టమైన లోపాలు గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది.కుప్పకూలిన షేర్లు సంస్థల అవసరం తగ్గిపోతుందని భయాలు నెలకొన్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఆయా సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో తమ షేర్లను భారీగా విక్రయించడం మొదలుపెట్టారు. దీంతో అమెరికా మార్కెట్లో ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు పడిపోయాయి. ఒక్టా కంపెనీ షేర్లు 9 శాతానికి పైగా పడిపోగా క్రౌడ్ ‌స్ట్రైక్ కంపెనీ స్టాక్స్ 8 శాతం మేర తగ్గాయి. క్లౌడ్ ‌ఫ్లేర్ కంపెనీ స్టాక్ 8 శాతం, స్కేలార్, సెయిల్‌ పాయింట్ స్టాక్స్ 5.5 నుంచి 9 శాతం మేర కుప్పకూలాయి. దీంతో శనివారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.90,730 కోట్లు (10 బిలియన్ డాలర్లు) మేర ఆవిరైపోయింది. గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ సైతం 5 శాతం మేర క్షీణించి 2023 నాటి కనిష్ఠ స్థాయిలకు పడిపోయింది. సైబర్ సెక్యూరిటీ సంస్థలు రియల్ టైమ్ ప్రొటెక్షన్, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌ వంటి సేవలు అందిస్తాయి. ఆంథ్రోపిక్ ఏఐ టూల్ కోడ్ ఆడిటింగ్, లోపాలు గుర్తింపునకే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఏఐ టూల్స్ వల్ల ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం ఎదుర్కొన్న 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత దారుణమైన పతనాన్ని ఇప్పుడు చూసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిశోధనలోనే ఉన్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ఆ భయాలు ఆత్మరక్షణలో పడేలా చేశాయి.