ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సోలార్ పార్క్ ఏర్పాటు కానుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో 200 మెగావాట్ల సోలార్ పవర్ పార్కు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1200 కోట్లతో యశస్వ పవర్ ఎల్ఎల్‌పీ ఈ సోలార్ పార్కును అభివృద్ధి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాల సాధన దిశగా ఈ సోలార్ పార్కు ఉపయోగపడనుంది. అలాగే పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు యశస్వ పవర్ ఎల్‌ఎల్‌పీ సంస్థ.. క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలోని బీచిగానిపల్లి , ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ సోలార్ పార్క్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు ఏటా 445 మిలియన్ యూనిట్ల క్లీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంతో ఈ సోలార్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా 690 మందికి ప్రత్యక్షంగా. మరికొందరికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు చెప్తున్నారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సోలార్ పార్కు ఏర్పాటుకానుంది."ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగంలో క్లీన్‌మాక్స్ సంస్థ పెట్టుబడిని స్వాగతిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కి అనుగుణంగా, పెద్ద ఎత్తున గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుంది" అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు ఎక్కువ. దీంతో ఈ ప్రాంతం నుంచి అటు కర్నాటక, ఇటు హైదరాబాద్ ప్రాంతాలకు జనం వలస పోతుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో డ్రోన్లు, ఏరోస్పేస్, సోలార్ పార్కులు ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అటు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మధ్యలో ఉండటంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నారు. జాతీయ రహదారి సౌకర్యం, సమీపంలోనే విమానాశ్రయాలు ఉండటంతో ఆసక్తి చూపుతున్నారు.