భయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన తురకపాలెం.. ఆ పొలిమేర రాయి కథేంటి?

Wait 5 sec.

భయం.. రోగానికంటే ప్రమాదకరమైంది.. రోగం క్రమక్రమంగా చంపితే.. భయం అప్పటికప్పుడు చంపేస్తుంది.. అదేదో సినిమాలో డైలాగ్. సినిమాల్లో డైలాగ్ చెప్పడం ఈజీనే కానీ.. జీవితంలో మాత్రం చాలా కష్టం. చుట్టూ ఉన్న వాళ్లు, తెలిసిన మనుషులు, అప్పటిదాకా మనతో పాటు తిరిగిన వారు అనుకోని విధంగా మనల్ని వదిలి వెళ్తుంటే.. అందుకు కారణాలు కూడా స్పష్టంగా తెలియకుంటే.. ఏం జరుగుతుందోననే ఆందోళన చుట్టుముడుతుంటే.. తిన్నా తిన్నట్లు ఉండదు.. పడుకున్నా నిద్ర ఉండదు.. బతుకు, చావుల మధ్య ఊగిసలాడుతున్న ఆ స్థితే.. భయం.. ఆ భయాన్ని ఆ ఊరి జనం గత కొన్నిరోజులుగా అనుభవిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తమ కళ్ల ముందు జరుగుతున్న ఘటనలు వారిని మరింత భయపెడుతున్నాయి. వాస్తవమేదో, వదంతులేవో దేవుడెరుగు.. మమ్మల్ని బతుకించు దేవుడా అంటూ ఆ ఊరి జనం మొరపెట్టుకుంటున్నారు.. ఆ ఊరే తురకపాలెం.. గా మారింది. గత కొన్ని రోజులుగా ఆ ఊరిలో సంభవిస్తున్న మరణాలు ఊరిజనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఆ ఊరిలోని 23 మంది వరకూ చనిపోవటం ఊరిజనాన్ని నిలువెల్లా వణికిస్తోంది. ఆ భయం ఎంత వరకూ వెళ్లిందంటే చివరకు ఊరవతల రాయిని కూడా అనుమానించేలా పరిస్థితి వచ్చింది. తురకపాలెంలో సంభవిస్తున్న వరుస మరణాల వెనుక మెలియాయిడోసిస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే అధికారులు వీటిని ధ్రువీకరించడం లేదు. మెలియాయిడోసిస్‌ ఇన్ఫెక్షన్‌ ఆనవాళ్లు కనిపించడం లేదని.. మరికొన్ని పరీక్షల ఫలితాలు వస్తేనే క్లారిటీ వస్తుందంటున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ చనిపోయినవారిలో 9 మందికి మాత్రమే మద్యం తాగే అలవాటు ఉంది.పొలిమేర రాయి కథేంటి..?మరోవైపు గ్రామస్థులలో భయం ఈ రేంజులో ఉండటంతో ఈ మరణాలకు పొలిమేర రాయి కారణమనే వదంతులు వచ్చాయి.. గ్రామస్థుల భయాన్ని తొలగించేందుకు అధికారులు కూడా ఆ రాయిని సరిచేశారంటే.. తురకపాలెం ప్రజల భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఊరి జనం చెప్తున్న వివరాల ప్రకారం తురకపాలెంలోని ఓ కాలనీలో సుమారుగా మూడు నెలల కిందట పదిమంది మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. పూజల తర్వాత నాలుగువైపులా పొలిమేరల్లో రాయిని ప్రతిష్ఠించారు. అయితే ఇందులో ఓ రాయిని సరిగా నిర్మించలేదని.. అందులో అక్షరం తప్పుగా రాశారని గ్రామస్థులు చెప్తున్నారు. ఇదే మరణాలకు కారణమని పుకార్లు బయల్దేరాయి. ఈ పొలిమేర రాయిని సాధారణ స్థితిలో ఏర్పాటుచేస్తే పరిస్థితి సాధారణంగా మారుతుందని కొంతమంది నమ్ముతున్నారు. దీంతో అధికారులు కూడా వారిలో ధైర్యం నింపేందుకు ఈ పొలిమేర రాయిని గురువారం సరిచేయించారు. దీంతో తురకపాలెంలోని ఓ వర్గం ఊపిరి పీల్చుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటనగుంటూరు జిల్లా తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని, వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ప్రతి వ్యక్తికి తక్షణ ఆరోగ్య పరీక్షలు (కిడ్నీ, షుగర్, బీపీ టెస్టులు మొదలైనవి) నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన వైద్య చర్యల ప్రగతిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వాలని ఆదేశించారు.