: అసలే పండగ సీజన్. ఇక ఈ సమయంలో షాపింగ్ సంగతి చెప్పనక్కర్లేదు. పండగల వేళ.. అసలే బతుకమ్మ, దసరా, దీపావళి వేళ.. కొత్త దుస్తులు ధరించడం భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా ఉంది. దీంతో చిన్న చిన్న దుస్తుల షాపుల నుంచి.. షాపింగ్ మాల్స్ వరకు అన్నీ కళకళలాడుతుంటాయని చెప్పొచ్చు. పండగల వేళ విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో.. రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా.. కస్టమర్లను ఆకర్షించేందుకు స్పెషల్ సేల్స్ లాంఛ్ చేస్తాయి. వేర్వేరు మోడళ్లపై వేర్వేరు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఇక ఇప్పుడు దీపావళి పండక్కి ముందు డబుల్ ధమాకా అందించింది కేంద్రం. అవును.. నిత్యావసరాల నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్, కార్లు ఇతర ఎన్నో రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఇక్కడ నేరుగా జీఎస్టీ తగ్గింపు రేట్లను కస్టమర్లకు బదిలీ చేస్తే.. పూర్తి ప్రయోజనాలు అందనున్నాయి. ఇవి ఎంతవరకు చేస్తాయనేది చూడాలి. ఇక్కడ ముఖ్యంగా.. మనం ఇప్పుడు పండగల సమయాల్లో కొత్త బట్టలు, చెప్పులు, షూస్ కొనుగోలు చేసేందుకు.. సెప్టెంబర్ 22 వరకు ఆగాలా.. ఇప్పుడే మంచి సమయమా. ఏయే రేట్లపై ఇక్కడ జీఎస్టీ ఎంత తగ్గింది.. వేటిపై పెరిగాయనేది తెలుసుకుందాం. >> ఇక్కడ దుస్తులు, ఫుట్‌వేర్‌పై చూస్తే.. ఒక వర్గం వారికి లాభం చేకూరింది. మరో వర్గం వారు ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తోంది. గతంలో రూ. 1000 లోపు పాదరక్షలు, పన్ను రేటు 5 శాతంగానే ఉండేది. ఆపైన అన్నింటికీ 12 శాతం పన్ను రేటు ఉండేది. ఇప్పుడు మాత్రం సంస్కరణల్లో భాగంగా రూ. 2500 లోపు దుస్తులు, ఫుట్‌వేర్‌పై జీఎస్టీని 5 శాతం శ్లాబులోకి తీసుకొచ్చారు. ఇక్కడ రూ. 2500 లోపు విలువైనవి కొనుగోలు చేస్తే.. జీఎస్టీ తక్కువగానే పడనుంది. ఇదే సమయంలో రూ. 2500 పైన కొనుగోలు చేస్తే.. గతంలో కంటే ఎక్కువ జీఎస్టీ పడుతుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు 12 శాతం శ్లాబు లేదు కాబట్టి.. ఇది 18 శాతం శ్లాబులోకి చేరిందన్నమాట. అంటే గతంలో రూ. 3 వేల విలువైన చెప్పులు, షూస్, దుస్తులు కొనుగోలు చేస్తే.. జీఎస్టీ 12 శాతం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి దీనిపైనే 18 శాతం చెల్లించాలి. అంటే ఎక్కువ భారం పడుతుంది.కాబట్టి.. ఇక్కడ రూ. 2500 లోపు కొనుగోలు చేయాలనుకునే వారు.. సెప్టెంబర్ 22 వరకు ఆగడం మంచిదని.. తద్వారా పన్ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. రూ. 2500 పైన విలువైనవి కొనుగోలు చేయాల్సి వస్తే.. సెప్టెంబర్ 22 లోపు షాపింగ్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ రూ. 2500 పైన ధర దుస్తులపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరగడం వల్ల మధ్యతరగతికి ఇవి అందుబాటులో లేకుండా పోతాయని.. పరిశ్రమ భావిస్తోంది.>> ఇప్పటికే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేస్తామని రిలయన్స్ రిటైల్ నుంచి ఆ కంపెనీ డైరెక్టర్ ఇషా అంబానీ హామీ ఇచ్చారు. రిటైల్ ఇండస్ట్రీలో రిలయన్స్ రిటైల్ నుంచి రిలయన్స్ ట్రెండ్స్ సహా టాటా జుడియో, విశాల్ మెగా మార్ట్ వంటివి బిగ్ ప్లేయర్లుగా ఉన్నాయి.