ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గ్రీన్స్ ట్యాక్స్ (హరిత పన్ను)‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా వాహనాల పన్ను తగ్గింపునకు ప్రభుత్వం ఒక బిల్లును శాసనసభలో పెట్టనుంది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో "ఏపీ మోటార్‌ వాహనాల పన్ను విధింపు (సవరణ) 2025 బిల్లు"ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్‌లో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. హరిత పన్ను తగ్గించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది అంటున్నారు. రాష్ట్రంలో సరకు రవాణా, ప్రజారవాణా వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ భారాన్ని తగ్గిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గత ప్రభుత్వం గరిష్టంగా రూ.20 వేల వరకు పన్ను విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం దానిని రూ.1,500 నుంచి రూ.3,000 వరకు రెండు స్లాబ్‌లలో వసూలు చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. భారాన్ని తగ్గించింది. ఈ విధానం ప్రకారం గ్రీన్ ట్యాక్స్‌ను రెండు రకాలుగా విభజించారు. మొదటి స్లాబ్‌లో రూ.1,500, రెండో స్లాబ్‌లో రూ.3,000 వసూలు చేస్తారు. గతంలో రూ.20 వేల వరకు ఉన్న పన్నును తగ్గిస్తూ ప్రజలకు ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలంటే లారీలు, బస్సులు వంటి వాహనాలకు హరిత పన్ను చెల్లించాలి. గత ప్రభుత్వం 2022 జనవరి నుంచి ఈ పన్నును భారీగా పెంచింది. దీని వల్ల రవాణా శాఖకు ఆదాయం బాగా పెరిగింది. పాత వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.గతంలో హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్) గతంలో రూ.200 మాత్రమే ఉండేది. అయితే కేంద్రం కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలని ఈ ట్యాక్స్ పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం గ్రీన్స్ ట్యాక్స్‌ను భారీగా పెంచింది. 7 నుంచి 12 ఏళ్ల వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ పెంచడంతో రవాణా శాఖకు ఆదాయం బాగా పెరిగింది. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10 నుంచి 12 ఏళ్ల వాటికి ఒక త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటితే రెండు త్రైమాసిక పన్నులు కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని వల్ల రవాణా శాఖకు 2022-23లో రూ.89.96 కోట్లు, 2023-24లో రూ.102.94 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో వాహనాల కేటగిరీని బట్టి ఏటా కనీసం రూ.800 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు చెల్లించాల్సి వచ్చేది. నారా లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో ఏపీ లారీ యజమానుల సంఘం నేతలు కలిశారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని కోరారు.. అప్పుడే లోకేష్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్‌ను కూడా ఈ మేరకు హామీ ఇచ్చారు.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇటీవల గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పన్ను తగ్గించడం వల్ల లారీ యజమానులకు ఊరట లభించింది. తాజాగా అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.