హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికప్పుడు నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం చాలామందికి భరించలేని కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు ప్రారంభం నగర వాసులకు ఊరటనిచ్చింది. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారు కూడా సమయాన్ని ఆదా చేసుకోవడానికి, తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరుకోవడానికి మెట్రోపై ఆధారపడుతున్నారు. రోజువారీగా సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగిస్తున్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. కూర్చోవడానికి మాత్రమే కాకుండా నిలబడే స్థలం కూడా లభించని రీతిలో మెట్రో రైళ్లు నిండిపోతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి రోజుల్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం వచ్చే భక్తుల రాకపోకలు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. తాజాగా గణేశ్ నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో నిర్వాహకులు నగరవాసులకు భారీ శుభవార్త చెప్పారు. సాధారణంగా రాత్రి 11 గంటలకే సర్వీసులు ముగుస్తాయి. కానీ.. ఈసారి ఉదయం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు రైళ్లు నడపాలని నిర్ణయించారు. అర్ధరాత్రి తరువాత కూడా అందుబాటులో ఉండే ఈ సౌకర్యం భక్తులకు ఎంతో ఊరటనివ్వనుంది. ముఖ్యంగా ట్యాంక్‌ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ఈ మార్పు మేలైంది. ప్రతి స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ సౌకర్యం వల్ల పండుగ వాతావరణంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ఉండటమే కాకుండా.. ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ నిర్ణయం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేశారు. వేడుకలు ముగిసిన తరువాత రాత్రివేళల్లో ప్రైవేట్ వాహన సౌకర్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మెట్రో ఇచ్చిన సదుపాయం వారికి చాలా ఉపయోగపడుతోంది. బస్సులు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలతో పోలిస్తే వేగంగా, సమయపాలనతో ప్రయాణం చేసే అవకాశం మెట్రో ద్వారా లభిస్తోంది. భవిష్యత్తులో మెట్రో నెట్వర్క్ మరింత విస్తరించనుంది. కొత్త మార్గాల పాటు రాత్రివేళల్లో కూడా సర్వీసులు అందిస్తే, ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పండుగల సందర్భంలో తీసుకునే ఇలాంటి ప్రత్యేక నిర్ణయాలు నగర రవాణా వ్యవస్థలో మెట్రో స్థానాన్ని మరింత బలపరుస్తున్నాయి. మొత్తం మీద గణేశ్ నిమజ్జనాల సమయంలో మెట్రో అందించిన ప్రత్యేక సౌకర్యం.. హైదరాబాద్ ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చింది.