కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గా్మ్‌లో జరిగిన ఉగ్రదాడి.. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత సత్తా ఏంటో ప్రపంచ దేశాలు మొత్తం చూశాయి. గత కొన్నేళ్లలో భారత రక్షణ రంగం బాగా అభివృద్ధి చెందింది. భారత త్రివిధ దళాలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా సైనిక, ఆయుధ సంపత్తిని పెంచుకున్నాయి. అదే సమయంలో పొరుగు దేశాలు, మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌తో తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం నెలకొనడంతో.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. పోరాటం చేసేలా సర్వసన్నద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత రక్షణ రంగానికి సంబంధించి.. భవిష్యత్ ప్రణాళికను కేంద్రం తీసుకుంది. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో అలర్ట్ అయిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో భారీ మార్పులు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వచ్చే 15 ఏళ్ల కాలానికి.. రక్షణ ఆధునికీకరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అతిపెద్ద ప్లాన్ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే రక్షణ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.అణుశక్తితో నడిచే వార్ షిప్‌లు, నెక్స్ట్జనరేషన్ వార్ ట్యాంకులు, హైపర్ సోనిక్ మిసైల్స్‌, స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత ఆయుధాలు, అంతరిక్ష ఆధారిత యుద్ధ సాంకేతికతలను భారత సైన్యంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. 500కు పైగా హైపర్‌సోనిక్‌ క్షిపణులను త్రివిధ దళాలకు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే భారత సైన్యానికి దాదాపు 1,800 కొత్త తరం యుద్ధ ట్యాంకులను పాత టీ-72 యుద్ధట్యాంక్‌ల స్థానంలో తీసుకురానున్నారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేసేందుకు 400 తేలికపాటి యుద్ధ ట్యాంకులు, 50 వేల ట్యాంక్ మౌంటెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, 700 రోబోటిక్ కౌంటర్ ఐఈడీ వ్యవస్థలను సమకూర్చనున్నారు. 6 లక్షల శతఘ్ని గుండ్లు, మానవ రహిత విమానాలను అందించనున్నారు. ఇక ఇండియన్ నేవీ విషయానికి వస్తే.. సరికొత్త విమాన వాహక నౌకతోపాటు.. 10 నెక్స్ట్ జనరేషన్ వార్ షిప్‌లు, 7 అత్యాధునిక కార్వెట్‌లు, 4 లాండింగ్ డాక్ ప్లాట్‌ఫామ్‌లను అందించనున్నారు. అదే సమయంలో వార్ షిప్‌లకు అణు శక్తిని అందించే టెక్నాలజీని కూడా ఇచ్చేందుకు ఆమోదం లభించింది. ఎలక్ట్రోమాగ్నెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌ను కూడా అందించేందుకు రంగం సిద్ధం అయింది. మరోవైపు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు కూడా భారీగా ఆయుధ సామగ్రిని కల్పించనున్నారు. 75 హై ఆల్టిట్యూడ్ ఫ్యూడో శాటిలైట్లు, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, వందలాది ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులు, 100కు పైగా రిమోట్ పైలట్ విమానాలను కొనుగోలు చేయనున్నారు. 20 స్ట్రాటోస్పియరిక్‌ ఎయిర్‌ షిప్‌లను అందించనున్నారు. 21 శతాబ్దంలో శత్రువులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా త్రివిధ దళాలను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. వీటితోపాటు యాంటీ స్వార్మ్‌ డ్రోన్‌ సిస్టమ్‌లు, లేజర్‌ వెపన్స్, మానవ రహిత విమానాల కోసం ఎయిర్‌ టు సర్ఫేస్‌ మిసైల్స్‌, అత్యాధునిక టార్గెటింగ్‌ ప్యాడ్స్‌ వంటివి కూడా నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఇవ్వనున్నారు.