సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారా.. ఆధార్ కార్డుతో పట్టేస్తారు!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా రాజకీయం బాగా పెరిగిపోతోంది. ఫేక్ పోస్ట్‌లు, అనుచిత వ్యాఖ్యలు.. మార్ఫింగ్, ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలు తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతున్నాయి. అదే సమయంలో ఎవరిపై పడితే వారిపై ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా, అవమానించేలా పోస్ట్‌లు చేస్తుండటం.. చాలా కాలంగా పెద్ద సమస్యగా మారింది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలపై ఇలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే ఇందులో కొందరు తమ సొంత పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి.. పోస్ట్‌లు పెడుతుండగా మరికొందరు మాత్రం తమ పేరు, ఊరు, ఆచూకీ తెలియకుండా ఫేక్ పేర్లు, ఫోటోలతో అడ్డగోలుగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోజురోజుకూ పెరిగిపోతున్న సోషల్ మీడియా విపరీత పోకడలపై ఎన్నో రోజులుగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ తర్వాత.. సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారంపై మంత్రివర్గం కీలక చర్చ జరిపింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దాని కోసం తీసుకోవాల్సిన చర్యలు, తేవాల్సిన చట్టాలు, నియమ నిబంధనలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారంపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించి.. కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘం.. నిబంధనలను తయారు చేయనుంది. ఈ సందర్భంగా తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని తీసుకురావాల్సి ఉందని కేబినెట్ సబ్ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని.. అయితే అది గీత దాటి శ్రుతిమించకూడదని పేర్కొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని కూడా మంత్రుల ముందు సీఎం చంద్రబాబు ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని వెల్లడించారు.