జూన్ 2లోపు కొత్త ఎయిర్‌పోర్టు.. కేంద్రంతో మాట్లాడి శిలాఫలకం వేస్తాం: సీఎం రేవంత్

Wait 5 sec.

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఏర్పాటు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జూన్ 2లోపు ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేస్తామని చెప్పారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అనంతరం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.'ఇక్కడి నాయకులు కొత్త ఎయిర్‌పోర్టు కావాలని అడిగారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు అంశంపై ప్రధాని మోదీ, మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడాం. త్వరలోనే వీలైతే జూన్ 2 తేదీ లోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి శిలాఫలకం వేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎయిర్‌పోర్టుతో పాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్‌కు మంజూరు చేసి ఇక్కడి ఆదివాసీలకు ఉపాధి మార్గాలు చూపిస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌కు కొత్త యూనివర్సిటీ ఇస్తాం. త్వరలోనే దాని ప్రారంభోత్సవం ఉంటుంది.' అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాసర ఆలయానికి మహర్దశఇక అంతకు ముందు నిర్మల్‌ జిల్లా బాసరలో ముఖ్యమంత్రి రేవంత్‌ పర్యటించారు. కుటుంబంతో కలిసి శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. తమ మనవడు రియాన్ష్కు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. సరస్వతి దేవాలయ విస్తరణ పనులకు ఇప్పటికే అధికారులు రూ.225 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. అమ్మవారి గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పం, మాడ వీధులు, కోనేరు, రాజ గోపురం, ఇత‌ర గోపురాలు, ఉత్తర ద్వారాల అభివృద్ధి నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తులను శృంగేరి పీఠం నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు విస్తరించనున్నారు. ఆలయం ఉత్తరం వైపు 9 అంత‌స్తుల రాజ‌గోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల చొప్పున గోపురాలు, 33 అడుగుల వెడ‌ల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారాలను అత్యద్భుతంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పిప్పిరి ఎత్తిపోతల పథకం, తేజపూర్ ఎత్తిపోతల పథకం, బుగ్గారం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగి చెక్‌డ్యాం, నాగోబా ఆలయ సుందరీకరణ అభివృద్ధి పనులకు రూ.20.40 కోట్లు, బోథ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనం, పొచ్చరలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు.