ఏప్రిల్ 10 నుంచి తీవ్రం కానున్న ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిపుణుల హెచ్చరికలు

Wait 5 sec.

ఎండాకాలం మొదలైన తర్వాత ఆకస్మిక వర్షాలు కురుస్తుండటం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో భానుడి భగభగలు కూడా నమోదు అవుతున్నాయి. వడగండ్ల వానలతోపాటు.. ఎండలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి వేసవి కాలం.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురిసి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయని హెచ్చరిస్తున్నారు. రానున్న 10 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉండనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రజలు ఎండల పట్ల అలర్ట్‌గా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.మరీ ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో ఎండలు భీకరంగా ఉండనున్నాయని పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు కూడా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా భానుడి ప్రభావం అధికంగానే ఉండనున్నట్లు తెలిపారు. హీట్ ఐలాండ్ ప్రభావంతో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వేడి కారణంగా స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణుల కారణంగా.. అక్కడక్కడా ఉరుములతో కూడిన వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయని.. భూమిలో వేడి పెరగడం వల్ల వర్షం పడిన తర్వాత మరింత ఉక్కపోత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.మరోవైపు.. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. కామారెడ్డి, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలకు రైతులకు చేతికొచ్చిన తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం రోజున ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.