అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం.. ఈసారి కూడా పైపులకు మంటలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో నిర్మాణమవుతున్న హెచ్‌వోడీల భవనాల దగ్గర సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి సంబంధించిన పైపులకు నిప్పు అంటుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదం జరిగిన చోట దట్టమైన పొగతో మంటలు ఎగసి పడటంతో అదుపు చేయటం కాస్త కష్టంగా మారింది. ఈ నెల 11న కూడా జరిగింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు చేస్తున్న ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన రూ.కోట్ల విలువైన హెచ్‌డీపీఈ పైపులకు కూడా ఇలాగే మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మర్చిపోకముందే మరోసారి పైపులకు మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా, కుట్ర కోణం ఏదైనా ఉందా అనేది చూడాలి. తాజాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరుసగా రెండు అగ్నిప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.. తాజా అగ్నిప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు.అమరావతిపై మంత్రి నారాయణరాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు రాజధానిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో టెండర్ల విషయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. టెండర్ల విషయంలో ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం నిబంధనలను పాటిస్తున్నామన్నారు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు సహా ఐదు ఐకానిక్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని.. ప్రపంచంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు.. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. కేంద్రం సహకారంతో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి నారాయణ.