ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ పోలీస్ స్టేషన్‌కు మార్చి 14న వచ్చిన ఓ సాధారణ నిఘా సమాచారంతో తీగలాగితే డొంక కదిలినట్టు భారీ గూఢచర్య కుట్ర వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్‌లోని కౌశాంబి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కొంత మంది యువకుల అనుమానస్పద కార్యకలాపాలపై ఆరా తీయగా.. పాకిస్థాన్‌‌లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్న నెట్‌వర్క్‌ బయటపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. భోవాపూర్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లు, సైనిక స్థావరాల ఫోటోలు, వీడియోలు తీసి విదేశాలకు పంపుతున్నారన్న సమాచారంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. వారికి డబ్బు ఆశ చూపించి, మరింత మంది యువకులను చేర్చాలని ప్రోత్సహించారు.తొలుత ఐదుగురు పురుషులు, ఒక మహిళను పోలీసులను అదుపులోకి తీసుకోగా.. వారి మొబైల్ ఫోన్లలో లభించిన సమాచారం ఆధారంగా వీడియోలు, ఫోటోలు, లొకేషన్ ట్యాగులు, సైనిక స్థావరాల వివరాలు, రైల్వే స్టేషన్లపై భారీ ఆపరేషన్ జరుగుతున్నట్టు నిర్ధారించారు. ఈ కేసు విచారణకు యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పాకిస్థాన్‌లో ఉన్న సుహైల్ మాలిక్, నౌషాద్ అలీ, సమీర్ అలియాస్ షూటర్ దీనిని నడిపిస్తున్నారని గుర్తించారు. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా యువకులను నియమించుకుని.. ఏ రైల్వే స్టేషన్లు ఫోటోలు, ఏ ప్రాంతాల మ్యాపింగ్ చేయాలి, ఏ కోణాల్లో షూట్ చేయాలి, ఎప్పుడు కోఆర్డినేట్లు పంపాలి అన్నీ స్పష్టమైన ఆదేశాలుగా ఇచ్చేవారు. ఒక్కో పనికి రూ. 5,000- రూ. 20,000 వరకు అందజేస్తున్నట్టు గుర్తించారు. ఆర్థికంగా బలహీన యువతను వారు టార్గెట్ చేసుకున్నట్టు తేలింది.అరెస్టైన ఆరుగురిలో నలుగురు గతంలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు వెళ్లి, సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంపినట్టు నిర్దారణ అయ్యింది. దర్యాప్తు సంస్థల అంచనాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లో మరో పెద్ద దాడికి సర్వే చేసినట్టు భావిస్తున్నారు. ఢిల్లీ-జమ్మూ రైల్వే మార్గంలో సోలార్ ఎనర్జీతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, సైనిక కదలికలను ప్రత్యక్షంగా పాక్‌కు చేరవేయాలని ప్లాన్ చేశారు.ఢిల్లీ కంటోన్మెంట్, హర్యానాలోని సోనిపట్ ప్రాంతాల్లో ఇప్పటికే ఇటువంటి కెమెరాలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. మొబైల్ రిపేర్ షాపుల్లో పనిచేసేవారు, సీసీటీవీ టెక్నీషియన్లు, నెట్‌వర్‌పై పరిజ్ఞానం ఉన్నవారిని ఇందులో చేర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో కీలక రిక్రూటర్‌గా ఇరమ్ అలియాస్ మహక్‌ను గుర్తించారు.ఇదే సమయంలో ఓటీపీ, సిమ్ కార్డుల సరఫరా రాకెట్‌పై కూడా దర్యాప్తు చేపట్టారు. భారతీయ నంబర్లతో సోషల్ మీడియాలో ఖాతాలను నిర్వహించేందుకు వీలుగా ఇండియన్ ఓటీపీలను విదేశాలకు పంపుతున్నారు. ఇందుకోసం రూ. 500-రూ. 5,000 వరకు చెల్లింపులు చేశారు. సిమ్ కార్డుల కోసం ఫేక్ ఐడీలు, ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌లు వంటివి ఉపయోగించారు. మార్చి 20న ఐదుగురు మైనర్లు సహా తొమ్మిది మంది, 22న ఫరీదాబాద్‌లో టైర్ పంక్చర్ షాపు నడిపే నౌషాద్ అలీ అలియాస్ లాలూ, మథురలో ఈ-రిక్షా డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, నేపాల్ వరకు ఈ నెట్‌వర్క్ విస్తరించింది.