తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా, సర్వే పూర్తయిందన్న కేంద్రమంత్రి

Wait 5 sec.

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్లలో ఆధునిక వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెరుగైన పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో 100 శాతం విద్యుదీకరణ పూర్తి కావడం, కవచ్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు, కొత్తగా వందే భారత్, అమృత్ భారత్ ట్రైన్లు యాణికులకు అందుబాటులోకి వచ్చాయి. పలు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా.. డోర్నకల్‌-గద్వాల మధ్య ప్రతిపాదించిన కొత్త లైన్‌ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయినట్లు తెలిపారు. 296 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు బుధవారం (మార్చి 25) లోక్‌సభలో ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. డీపీఆర్‌ తయారీ కోసం నిర్వహించిన సర్వే ప్రకారం ఈ కొత్త రైల్వే లైన్‌ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుందని వెల్లడించారు. డీపీఆర్‌ తయారీ తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖలతో సంప్రదించిన అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటుగా తెలంగాణ ఏపీ ట్రైన్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు జడ్చర్ల- నంద్యాల మధ్య 182 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌ నిర్మాణం కోసం ఇప్పటికే సర్వే పూర్తి చేశామన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామన్నారు. భూసేకరణలో జాప్యం కారణంగా గుంటూరు- బీబీనగర్‌ డబ్లింగ్, కాజీపేట-విజయవాడ మూడో లైన్, ముద్‌ఖేడ్‌-మేడ్చల్,మహబూబ్‌నగర్‌-డోన్‌ డబ్లింగ్, మనోహరాబాద్‌-కొత్తపల్లి కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్ల పథకం కింద రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 40 రైల్వేస్టేషన్లలో ఇప్పటికే 6 స్టేషన్ల ఆధునికీకరణ పనులు పూర్తయినట్లు తెలిపారు. అందులో కరీంనగర్, రామగుండం, జోగులాంబ, వరంగల్‌, బేగంపేట, హఫీజ్‌పేట స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌-ఘట్‌కేసర్‌-చర్లపల్లి స్టేషన్ల మధ్య 55 ఎంఎంటీఎస్‌ ట్రైన్లు నడుస్తున్నాయని రైల్వేమంత్రి వెల్లడించారు. ఇందులో సికింద్రాబాద్‌-చర్లపల్లి మధ్య 39 ట్రైన్లు, చర్లపల్లి-ఘట్‌కేసర్‌ మధ్య ట్రైన్లు, సికింద్రాబాద్‌-చర్లపల్లి-ఘట్‌కేసర్‌ సెక్షన్ల మధ్య ట్రైన్లు నడుస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టామని త్వరలోనే వాటిని పూర్తియ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.