ఆ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50 వేలు, తాగితే రూ.10 వేలు ఫైన్.. బెల్ట్ షాపుల బెండు తీస్తున్న మహిళలు

Wait 5 sec.

మన రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. అయితే వైన్ షాపులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. ఇక గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో భారీగా మద్యం విక్రయాలు జరుగుతాయి. అయితే ఈ బెల్ట్ షాపుల ఆగడాలు ఎక్కువవుతూ ఉంటాయి. టైంతో సంబంధం లేకుండా 24 గంటల పాటు మద్యం అమ్మకాలు సాగుతూ ఉంటాయి. ఇలా మద్యం విచ్చలవిడిగా దొరకడంతో కొందరు ఫూటుగా మద్యం సేవించి.. పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలోని ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. యువత, పెద్ద వారు మద్యానికి బానిసలై.. భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నాయని గుర్తించిన మహిళలు.. సంచలన తీర్మానం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కారాజుపేట గ్రామానికి చెందిన మహిళా సంఘాలు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మక్కారాజుపేట గ్రామంలో బెల్ట్ షాపుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళలంతా ఏకం అయ్యాయి. గురువారం రోజున గ్రామంలో ఉన్న విద్యార్థులతో కలిసి భారీగా ఊరేగింపు నిర్వహించిన మహిళలు.. మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యానికి బానిసై కుటుంబాలను అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీంతో ఇక చాలు.. మద్యం వద్దు - ప్రాణం ముద్దు అంటూ మహిళలు పోరాట బాట పట్టారు. అదే సమయంలో మక్కారాజుపేటను మద్యం రహిత గ్రామంగా మార్చేందుకు మహిళా సంఘాలు కొన్ని కఠిన నిర్ణయాలకు ఆమోదం కల్పించారు. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపు పెట్టి మద్యం విక్రయిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధించనున్నారు. అమ్మేవారికి మాత్రమే కాకుండా మద్యం సేవించే వారికి కూడా భారీగా జరిమానాలు వేయనున్నారు. మద్యం తాగిన వారికి రూ.10 వేల ఫైన్ జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. అయితే కేవలం మాటలు, హెచ్చరికలకే పరిమితం కాకుండా.. ఈ నిబంధనలతో వార్నింగ్ బోర్డులను కూడా మహిళలే గ్రామం మొత్తం అతికించి.. అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.ఇక గ్రామంలో ర్యాలీ నిర్వహించిన తర్వాత మహిళలు.. స్థానికంగా ఉన్న దాబాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన మాంసం, నిల్వ ఉంచిన గుడ్లు, కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు.