రైతుల కష్టాలకు చెక్.. ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి.. 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు

Wait 5 sec.

భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ తప్పుల తడకగా ఉందని.. ఉన్న సమస్యలు తీర్చడం సంగతి అటుంచితే.. కొత్త సమస్యలను తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ప్రయోగాత్మకంగా మొదట పైలట్ ప్రాజెక్టు కింద 5 మండలాల్లో అమలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల (ఏప్రిల్‌) 2వ తేదీ నుంచి ఇంటిగ్రేటెడ్‌ భూ భారతి పోర్టల్‌ను అమలు చేయనున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా 5 మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం.. రంగారెడ్డి జిల్లాలోని అమన్‌గల్‌ మండలం.. సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ సేవలు అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. తాజాగా సెక్రటేరియట్‌లో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌తోపాటు ఎన్‌ఐసీ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష చేశారు. ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తయారు చేసినట్లు తెలిపారు. భూములకు సంబంధించి.. రెవెన్యూ, సర్వే, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఈ ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ తీసుకువచ్చినట్లు వెల్లడించారు. భూ లావాదేవీల వివరాలు పూర్తిగా కనిపించే పారదర్శక వ్యవస్థగా ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను మంత్రి పొంగులేటి అభివర్ణించారు. భూమికి సంబంధించి ప్రతీ ఒక్క సర్వే నెంబర్‌కు మనుషులకు ఆధార్‌ నెంబర్ లాగానే భూములకు భూదార్‌ నెంబర్‌లను కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ భూములకు సంబంధించి.. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సర్వే మ్యాప్‌ జతచేయడం ఈ 5 మండలాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేసిన తర్వాత.. ఈ ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు సులభంగా సేవలు అందించడం.. భూ వివాదాలకు పరిష్కారం చూపించే దిశగా ఈ ఒక కీలక అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.