తెలంగాణ రాష్ట్రంలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని దివ్యానగర్ లేఔట్ లో భూ ఆక్రమణలు, అడ్డుగోడల కారణంగా దాదాపు 12 సంవత్సరాలుగా తమ ప్లాట్లను చూడలేక.. వెళ్లలేక ఇబ్బందులు పడిన 2218 మంది ప్లాట్ యజమానులకు ఎట్టకేలకు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హైడ్రా)( ) ద్వారా విముక్తి లభించింది. తమకు విముక్తి కల్పించినందుకు కృతజ్ఞతగా ప్లాట్ యజమానులు గురువారం మరోసారి కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. దివ్యానగర్ లేఔట్ యజమానులు తమ నాటి భయంకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు. 200 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ లేఔట్ చుట్టూ నల్లమల్లారెడ్డి అనే వ్యక్తి దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడను నిర్మించారు. అంతేకాక, రహదారులను, పార్కు స్థలాలను కూడా అక్రమంగా దురాక్రమించారు. ప్లాట్ల యజమానులు తమ ప్లాట్‌ను చూసేందుకు, ఇతరులకు చూపించడానికి కూడా అనుమతి ఉండేది కాదు. నల్లమల్లారెడ్డి నియమించిన వ్యక్తులు ఎంట్రీ పుస్తకంలో వివరాలు నమోదు చేసిన తర్వాతే అనుమతి ఇచ్చేవారు. వారిని ప్రశ్నిస్తే దౌర్జన్యంగా కొట్టి పంపించేవారు అని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. "అడ్డుగోడలు బద్దలు కాకపోతే, తమ ప్లాట్లు ఎక్కడున్నాయో గుర్తించలేని పరిస్థితి ఉండేది" అని వారు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 25న హైడ్రా రంగంలోకి దిగి ఈ భారీ ప్రహరీ గోడను కూల్చి వేయడంతో 2218 మంది ప్లాట్ల యజమానులకు విముక్తి లభించింది. హైడ్రా కేవలం దివ్యానగర్ సమస్యను మాత్రమే కాకుండా.. దాని చుట్టూ ఉన్న అనేక ఇతర నివాస ప్రాంతాలకు కూడా అనుసంధానం మెరుగుపర్చింది. 4 కిలోమీటర్ల భారీ ప్రహరీ కూల్చివేతతో ఏకశిల లేఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్-1, మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, బాలాజీనగర్, ముత్తెల్లిగూడ వంటి 17కు పైగా నివాస ప్రాంతాలకు దారి దొరికింది. ముఖ్యంగా ఏకశిల-పీర్జాదిగూడ రోడ్డు, ప్రతాప్ సింగారం రోడ్డులకు సులభంగా చేరుకునే మార్గం సుగమం అయింది. ఇదే సందర్భంలో.. స్థానికులు మిర్జాలగూడ మున్సిపాలిటీలోని పర్వతాపురంలో ముస్లిం, క్రిస్టియన్ మతస్తుల శ్మశాన వాటికలను కూడా ఆక్రమణదారులు కబ్జా చేయగా, హైడ్రా వచ్చి విడిపించిందని ప్లాట్ యజమానులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం అధికార దుర్వినియోగం.. కబ్జాదారుల దౌర్జన్యాలపై ప్రజాస్వామ్య విజయం అని యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.