48 గంటల సమయం ఇస్తున్నా.. ఆ మసీదులను మీరు కూల్చుతారా.. నేనొచ్చి కూల్చాలా..? బండి సంజయ్ సవాల్..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో జరిగిన దేవాలయాల కూల్చివేత వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని సృష్టించింది. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా అధికారులు వ్యవహరించారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన , రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రీలతో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు, అదే రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులను ఎందుకు కూల్చలేదు?’ అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఎవరి మెప్పుకోసం ఈ మూకుమ్మడి ఆలయాల కూల్చివేతకు పాల్పడ్డారని నిలదీశారు. ఆటో డ్రైవర్లు, భక్తులు నిత్యం పూజించే మైసమ్మ ఆలయాలను ఇష్టానుసారం కూల్చివేయడం భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడమే అని ఆరోపించారు. ‘హిందువులంటే అంత చులకనా?’ అని ఆయన ప్రశ్నించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ గోదావరిఖని యంత్రాంగానికి 48 గంటల గడువు విధించారు. కూల్చివేసిన 46 దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఈ గడువులోగా పునర్నిర్మించాలి.. లేనిపక్షంలో, దారికి అడ్డుగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలి అని ఆయన సవాల్ విసిరారు. ముగిసిన వెంటనే తాను గోదావరిఖనికి వస్తానని, దగ్గరుండి మసీదులను కూల్చివేయిస్తానన్నారు. జరగబోయే తీవ్ర పరిణామాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై పెద్దపల్లి జిల్లా బీజేపీ నేతలు, రాష్ట్ర నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ హెచ్చరికలు గోదావరిఖనిలో మతపరమైన ఉద్రిక్తత పెరిగేందుకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉండగా.. దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేసినందుకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీనిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కొండపర్తి సంజీవ్‌, కోమళ్ల మహేష్‌ నాయకత్వంలో ర్యాలీగా వెళ్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆలయాలను కూల్చే ముందు బాధ్యులతో చర్చించాలన్న సుప్రీంకోర్టు సూచనను అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.