బిహార్‌లో పీకే మద్దతుదారు హత్య కేసులో ట్విస్ట్.. ఎన్డీయే అభ్యర్థి అరెస్ట్

Wait 5 sec.

అసెంబ్లీ ఎన్నికల వేళ మద్దతుదారు హత్య బిహార్‌లో సంచలనంగా మారింది. పీకే మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో తాజాగా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నా జిల్లాలోని మొకామా నియోజకవర్గం నుంచి జేఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తోన్న పీయూష్‌ ప్రియదర్శి ప్రచారం నిర్వహిస్తుండగా.. దులార్‌ చంద్‌ యాదవ్‌పై దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. బుల్లెట్‌ గాయమైనప్పటికీ యాదవ్ షాక్‌ కారణంగానే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. గ్యాంగ్‌స్టర్‌ అయిన యాదవ్ రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రీయ జనతాదళ్‌‌లో చేరారు. ఇటీవలే పీకే పార్టీలో చేరారు.ఈ హత్య కేసులో మోకామ్ ఎన్డీయే అభ్యర్థి అనంత్ సింగ్‌‌ను ఆదివారం ఉదయం ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సింగ్‌తో పాటు ఆయన అనుచరులు ఇద్దరు మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్‌లను కూడా అరెస్ట్ చేశారు. పట్నా ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ.. ‘దూలార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్, మణికాంత్ ఠాకూర్, రంజీత్‌ రామ్‌లను అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక, ప్రాథమిక విచారణలను బట్టి ఇది హత్య కేసుగా నిర్దారణకు వచ్చామని ఆయన చెప్పారు. కాగా, తన మద్దతుదారులు, దులార్ చంద్ యాదవ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఘటనా స్థలికి తాను దూరంగా ఉన్నానని అనంత్ సింగ్ అంతకుముందు చెప్పడం గమనార్హం. ‘‘ఏం జరిగిందో నాకు కచ్చితంగా తెలియదు... కానీ, మావాళ్లు కొంతమంది యాదవ్ అనుచరులు వాహనాలను ధ్వంసం చేశారని చెప్పారు.. అంతేకాదు, దీని వెనుక ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవి భర్త సూరజ్ భాన్ హస్తం ఉండొచ్చు.. అతడ్ని చంపి ఆ నేరం నాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆరోపించారు. కాగా, 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొకామా నియోజకవర్గం నుంచి అనంత్ సింగ్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కానీ, ఆయుధాల కేసులో 2022లో అనర్హతకు గురికావడంతో అతడి భార్య నీలమ్ దేవి ఉప-ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన జేడీయూలో చేరి, ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక, దులార్ చంద్ యాదవ్ హత్య తర్వాత జరిగిన ఘర్షణలతో పట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సింగ్‌ను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. అలాగే, రిటర్నింగ్‌ అధికారి, బాధ్, ఎస్డీవో చందన్‌ కుమార్‌, బాధ్-1 ఎస్డీపీవో రాకేశ్‌ కుమార్‌, బాధ్-2 ఎస్డీపీవో అభిషేక్‌ సింగ్‌లను తప్పించింది. అభిషేక్‌‌ను సస్పెండ్ చేసిన ఈసీ.. ఎస్పీ మినహా ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.