TGSRTC బస్ జర్నీ ఇక ఈజీ.. గూగుల్ మ్యాప్స్‌లో బస్ వివరాలు, టికెట్ రిజర్వేషన్..!

Wait 5 sec.

తెలంగాణ తమ ప్రయాణికులకు బస్సు టికెట్ రిజర్వేషన్లు, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు వినూత్న సాంకేతిక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా బస్ స్టేషన్లలోని కౌంటర్ల ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వ్ చేసుకునే విధానం అమల్లో ఉంది. అయితే ఈ ప్రక్రియను మరో మెట్టుకు తీసుకెళ్తూ.. త్వరలోనే నుంచే ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడంతో పాటు, అప్పటికప్పుడే రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.ఈ నూతన విధానం అమల్లోకి వస్తే.. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి, గమ్యస్థానం వివరాలను నమోదు చేయాలి. అక్కడ కనిపించే ఆర్టీసీ బస్సులలో తమకు అనువైన బస్సును ఎంచుకుని, వెంటనే ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. రిజర్వేషన్ తక్షణమే ఖరారై.. ఈ-టికెట్ మొబైల్‌కు వచ్చేస్తుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులతో పాటు, ఇదే విధానంలో టికెట్లను కొనుగోలు చేసి ప్రయాణించే వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కౌంటర్ల వద్ద రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది.ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి.. తెలంగాణ పరిధిలో తిరిగే పల్లె వెలుగు నుంచి అంతర్రాష్ట్ర సర్వీసుల వరకు అన్ని బస్సుల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం జాబితా సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని ఇప్పటికే ఐటీ శాఖ ద్వారా గూగుల్‌కు అందించినట్లు ఆర్టీసీ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్‌లో ఈ ప్రక్రియ టెస్టింగ్‌లో ఉంది. రాబోయే రెండు నుంచి మూడు వారాల తర్వాత ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం అందుబాటులోకి వచ్చాక, క్రమంగా జిల్లా బస్సుల వివరాలను కూడా గూగుల్‌కు అందించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు వేస్తోంది.పిన్ లెస్ చెల్లింపులుటికెట్ చెల్లింపుల విషయంలో మరో విప్లవాత్మక మార్పును తీసుకురావడానికి ఆర్టీసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం బస్సెక్కాక క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా టికెట్ తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ.. ఇందులో పిన్ నంబర్ నమోదు చేయాల్సి వస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు, పిన్ నంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, కార్డును టిమ్ యంత్రంపై ఉంచి ట్యాప్ చేయగానే నగదు చెల్లింపు జరిగి, టికెట్ జారీ అయ్యే విధానాన్ని సంస్థ తీసుకురానుంది. వారంలోగా ఈ అధునాతన విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత సిటీ బస్సులు, దూరప్రాంత సర్వీసులకు విస్తరించనున్నారు. ఈ రెండు సాంకేతిక మార్పుల వల్ల ఆర్టీసీ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా మారనున్నాయి.