మ్యాచ్ ఫలితాన్ని అటూ ఇటూ చేసే ఆఖరి పది ఓవర్లలో గేమ్ ఛేంజర్ అయింది. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా సఫారీ కెప్టెన్ లారా వోల్వార్ట్ అలుపెరుగకుండా పరుగుల ప్రవాహం కొనసాగిస్తోంది. సెంచరీ చేసి దూసుకుపోతున్న వోల్వార్ట్ ఇన్నింగ్స్‌కు దీప్తి అద్భుత బౌలింగ్‌తో అడ్డుకట్ట వేసే టీమిండియా మహిళల చిరకాల కలను నెరవేర్చింది. డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. భారత్ అందించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ మంచి రన్‌రేట్‌తో ముందుకు సాగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సరే సౌతాఫ్రికా కెప్టెన్ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి 40 ఓవర్ల వరకూ కొనసాగింది. 96 బంతుల్లోనే సెంచరీ చేసిన వోల్వార్ట్ చాలా భయంకరంగా క్రీజులోనే కుదురుకుపోయింది. ఆఖరి పది ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 88 పరుగులు కావాలి. చేతిలో నాలుగు వికెట్లు, క్రీజులో డేంజరస్ లారా వోల్వార్ట్, క్లో ట్రయన్ ఉన్నారు. ఈ సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 42వ ఓవర్‌ను దీప్తి శర్మకి ఇచ్చింది. ఇక హిట్టింగ్ చేయడమే పరమావధిగా మొదటి బంతినే వోల్వార్ట్ గాల్లోకి లేపింది. బౌండరీ వద్ద అమన్‌జోత్ కౌర్ అద్భుతంగా క్యాచ్ అందుకుంది. అదే ఓవర్‌లో క్లో ట్రయన్‌ను కూడా దీప్తి శర్మ ఎల్‌బీడబ్ల్యూ చేసింది. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లతో పాటు మొత్తం ఐదు వికెట్లు తీసుకుని టీమిండియా విజయంలో దీప్తి శర్మ కీలకంగా మారింది. 9.3 ఓవర్లు బౌలింగ్ చేసిన దీప్తి శర్మ 39 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకుంది. 220కి ఆరు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా దీప్తి మ్యాజిక్‌తో కేవలం 26 పరుగుల తేడాతోనే ఆఖరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. సౌతాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్రలో తొలిసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.