రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనలో బస్సు డ్రైవర్ దస్తగరి బాబా కూడా మృతి చెందాడు. అయితే దస్తగరి గతంలో తన చాకచక్యంతో 40 మంది ప్రాణాలను కాపాడాడు. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా.. 20 ఏళ్ల క్రితం పాత తాండూరుకు వలస వచ్చి స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పనిచేసిన ఆయన.. పదేళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు అద్దె బస్సులకు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.తాజాగా.. ప్రమాదానికి గురైన ఈ అద్దె బస్సుకు కేవలం పది రోజుల క్రితమే డ్రైవర్‌గా చేరాడు. ప్రతి రోజూ తాండూరు నుంచి హైదరాబాద్‌కు ఉదయం 4:40 గంటలకు బయలుదేరే మొదటి సర్వీసును నడుపుతున్నాడు. అయితే, సోమవారం ఉదయం మీర్జాగూడ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం అతని ప్రాణాలను బలిగొనడంతో పాటు, బస్సులోని మరో 19 మంది ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటనను గుర్తుచేసుకున్న అధికారులు, స్థానికులు రెండేళ్ల కిందట జరిగిన ఒక సంఘటన గురించి తెలిపారు. రెండేళ్ల క్రితం దస్తగిరి తాండూరు నుంచి వికారాబాద్ వెళ్లే బస్సును నడుపుతున్నప్పుడు.. వికారాబాద్ అనంతగిరి సమీపంలో ఆ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ సమయంలో ఏమాత్రం తొట్రుపడకుండా చాకచక్యంగా వ్యవహరించిన దస్తగిరి.. బస్సును ఎత్తు వైపు తీసుకువెళ్లి ఒక చెట్టును స్వల్పంగా ఢీకొట్టడం ద్వారా దాన్ని కంట్రోల్ చేశాడు. ఆ ప్రమాదం నుంచి దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి వీరోచిత డ్రైవర్‌గా నిలిచాడు.గతంలో పలువురి ప్రాణాలు కాపాడిన డ్రైవర్ సోమవారం నాటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు కావడం, ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో దస్తగిరి బాబా ఈసారి ప్రాణాలొదిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనలో బస్సు డ్రైవర్ తప్పు లేదని ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. టిప్పర్ లారీ అధిక వేగంతో ఉండటం, నాలుగు అడుగుల గుంతను తప్పించబోయి బస్సుపై దూసుకొచ్చినట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.