. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ టైటిల్ గెలుచుకుంది. కానీ అభిమానులు ఆశించినట్లుగా టీమిండియా కోసం విక్టరీ పరేడ్ నిర్వహించే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. విక్టరీ పరేడ్ ఎందుకు నిర్వహించడం లేదో కూడా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. “ప్రస్తుతం ఏ రకమైన విక్టరీ పరేడ్ ప్రణాళికలు లేవు” అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నవి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌ని ఆయన లైవ్‌లో వీక్షించి, పోస్ట్ మ్యాచ్ సెలబ్రేషన్స్‌లోనూ పాల్గొన్నారు. ఆ వెంటనే సోమవారం దుబాయ్‌కి ప్రయాణించి ఐసీసీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం బీసీసీఐకి కీలకమైంది, ఎందుకంటే ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై భారత్‌ మాట్లాడనుంది. 2025 సెప్టెంబర్ 28న దుబాయ్‌లో పాకిస్తాన్‌పై గెలిచిన తర్వాత, భారత జట్టుకు ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ప్రస్తుత ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ ఆ ట్రోఫీని ఇవ్వడానికి నిరాకరించాడు.“ఆసియా కప్ ట్రోఫీ అంశాన్ని ఐసీసీ సమావేశంలో ప్రస్తావిస్తాం. భారత జట్టు గెలుచుకున్న ట్రోఫీని గౌరవంగా తిరిగి పొందడం కోసం కృషి చేస్తాం” అని సైకియా స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రస్తుతం ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం ఇష్టపడటం లేదు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ సందర్భంగా భారీ జనం తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత బీసీసీఐ ఒక సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి కూడా సైకియానే అధ్యక్షత వహిస్తున్నారు. భారత మహిళా జట్టు మంగళవారం నాడు న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బీసీసీఐకి అధికారిక ఆహ్వానం అందిందని సమాచారం. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని జట్టు టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు, అలాగే 2024లో రోహిత్ శర్మ జట్టు విజయానంతరం ఘనమైన పరేడ్ నిర్వహించగా, ఈసారి మాత్రం మహిళల జట్టు గెలుపునకు అటువంటి వేడుక ఉండకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.