ఆంధ్రప్రదేశ్‌లో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.. ఈ మేరకు ఈ నెలలోనే శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రక్షణ రంగానికి చెందిన కేఎస్‌ఎస్‌ఎల్‌ (Kalyani Strategic Systems Limited) పరిశ్రమలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ రెండ పరిశ్రమల రాకతో ఏకంగా రూ.1,37,400 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఒకే నెలలో ఈ రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో ఏపీలో మరో కీలక మైలురాయిగా మారబోతోంది. ఈ పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమాలకు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెబుతోంది ప్రభుత్వం.అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్‌‌కు శంకుస్థాపనఅనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ (ఏఎంఎన్‌ఎస్‌) సంస్థ రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 14న కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. ఆర్రెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ మొదటి దశ 2029 నాటికి పూర్తవుతుంది.. ఏటా 8.2 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం. మిత్తల్ సంస్థ తమ ఉత్పత్తులను ఎగుమతి కోసం సొంతంగా పోర్టును కూడా నిర్మించనుంది. రెండో దశను 2033 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,020 ఎకరాల భూమిని రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌ పురం, వేంపాడు గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ భారీ స్టీల్ ప్లాంట్‌ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడుతోంది. అలాగే పర్యావరణానికి హాని కలిగించే దుమ్ము, ధూళి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు. పరిశ్రమ చుట్టూ వేలాది ఎకరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మిత్తల్ సంస్థ రెండు దశల్లో దాదాపు రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుందని చెబుతున్నారు. మొదటి దశలో రూ.70వేల కోట్లు, రెండో దశలో రూ.80వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.మడకశిరలో కేఎస్‌ఎస్‌ఎల్‌‌కు శంకుస్థాపనమరోవైపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కేఎస్‌ఎస్‌ఎల్‌ (Kalyani Strategic Systems Limited) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఈ నెల 6న శంకుస్థాపన నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ శంకుస్థాన కార్యక్రమానికి హాజరవుతారని చెబుతున్నారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యట నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.. ఈ క్రమంలో ఈ నెల 5న ముహూర్తం ఖాయం చేశారు. ఈ సంస్థ కేఎస్‌ఎస్‌ఎల్‌ సైన్యానికి అవసరమైన రక్షణ పరికరాలను తయారు చేస్తారు. ఈ సంస్థ కోసం ప్రభుత్వం 1,000 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే.కేఎస్‌ఎస్‌ఎల్‌ ఏర్పాటుకు మొదటి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని తయారు చేయడంతో పాటు వాటిని పరీక్షించే యూనిట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 500 ఎకరాలు కేటాయించనుంది. ఈ డిఫెన్స్‌ ఎనర్జిటిక్స్‌ యూనిట్ ద్వారా దేశ రక్షణ సామర్థ్యం మరింత పెరగనుంది. ఈ రెండు సంస్థలకు శంకుస్థాపన తర్వాత వెంటనే పనులు ప్రారంభించనున్నారు.