Women's world cup winner: ట్రోఫీ కోసం దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది.. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దక్కింది.. ప్రపంచ క్రికెట్‌లో భారత మహిళల జట్టు సువర్ణాధ్యాయం లిఖించింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా మారిన కలల కప్పును భారత మహిళల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. టోర్నీలో పడుతూ లేస్తూ ఫైనల్‌ వరకు చేరిన భారత్.. తుది పోరులో అదిరే ఆటతీరుతో దక్షిణాఫ్రికాను ఓడించింది. రెండుసార్లు తృటిలో చేజారిన వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను మూడోసారి ఒడిసిపట్టింది. 140 కోట్ల మంది భారతీయుల సంబురానికి కారణమైంది.ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైంది. వాస్తవానికి ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా అంటే సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) సత్తాచాటడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ప్రొటీస్ జట్టు ముందు 299 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఆడింది. దీంతో ఆ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్లు 9.2 ఓవర్లలో 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే అమన్‌జోత్ కౌర్ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ లౌరా వోల్వార్ట్‌ మాత్రం మొండిగా బ్యాటింగ్ చేసింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై శతక్కొట్టిన ఆమె.. ఫైనల్‌లోనూ అదే రిపీట్ చేసింది. దీంతో ఆమె ఉన్నంత సేపు దక్షిణాఫ్రికా విజయంపై ధీమాగానే ఉంది. కానీ 101 రన్స్ చేసిన తర్వాత దీప్తి శర్మ బౌలింగ్‌లో ఆమె ఔట్ కావడంతో భారత్ విజయం ఖరారైంది. చివరకు దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది.మూడోసారి మురిపెం..2025 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్ రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో.. 2017లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. కానీ ముచ్చటగా మూడోసారి మాత్రం కప్పును వదల్లేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని తొలిసారి ముద్దాడింది.